బెంగళూరు: ఐసీసీ ప్రపంచ కప్ 2023లో ముగింపు దశకు వచ్చేసింది. గ్రూప్స్ దశలో ఒక్కో మ్యాచ్ మాత్రమే మిగిలివుంది. నేడు రెండు మ్యాచ్లు షెడ్యూల్ అయ్యాయి. తొలి మ్యాచ్లో ఆస్ట్రేలియా- బంగ్లాదేశ్, రెండో మ్యాచ్లో ఇంగ్లాండ్- పాకిస్తాన్ తలపడుతున్నాయి. గ్రూప్ దశలో ఈ నాలుగు జట్లకూ ఇవే చివరి మ్యాచ్లు.
ఇందులో ఆస్ట్రేలియా ఒక్కటే సెమీ ఫైనల్స్కు చేరింది. మిగిలిన మూడూ ఇంటిదారి పట్టక తప్పదు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, నెదర్లాండ్స్, ఇంగ్లాండ్.. సెమీ ఫైనల్స్ రేసు నుంచి వైదొలిగాయి. ఈ నెల 15, 16 తేదీల్లో సెమీ ఫైనల్స్ జరుగుతాయి. 19వ తేదీన ఫైనల్ మ్యాచ్ ఉంటుంది.

15వ తేదీన జరిగే తొలి సెమీస్లో న్యూజిలాండ్ను ఢీకొడుతుంది న్యూజిలాండ్. దీనికి ముంబైలోని వాంఖెడె స్టేడియం వేదిక. ఆ మరుసటి రోజున కోల్కత ఈడెన్ గార్డెన్స్లో దక్షిణాఫ్రికాను ఎదుర్కొంటుంది ఆస్ట్రేలియా. 19 నాటి ఫైనల్కు గుజరాత్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం ఆతిథ్యాన్ని ఇస్తుంది.
ఇక భారత్ తన చివరి లీగ్ మ్యాచ్ను ఆదివారం ఆడబోతోంది. మధ్యాహ్నం 2 గంటలకు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. నెదర్లాండ్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్తో వరల్డ్ కప్ 2023 లీగ్స్ దశకు తెర పడుతుంది. ఇక సెమీ ఫైనల్స్, ఫైనల్స్పై అందరి దృష్టీ నిలుస్తుంది.
ఈ పరిస్థితుల్లో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డును రద్దు చేయాలనే డిమాండ్ ఊపందుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీనికి కారణం లేకపోలేదు. ప్రభుత్వం జోక్యం చేసుకుందనే ఏకైక కారణంతో శ్రీలంక క్రికెట్ బోర్డును ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) రద్దు చేసి అవతల పడేసింది.
తమ దేశ జాతీయ జట్టు వరల్డ్ కప్లో అధ్వాన్నంగా ఆడుతున్న కారణంగా శ్రీలంక క్రీడల శాఖ మంత్రి రోషన్ రణసింఘే క్రికెట్ బోర్డును రద్దు చేసిన విషయం తెలిసిందే. దీని తరువాత అర్జున రణతుంగ సారథ్యంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. దీనిపై శ్రీలంక అత్యున్నత న్యాయస్థానం 14 రోజుల పాటు స్టే విధించింది. దీన్ని తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది ఐసీసీ. లంక బోర్డు మొత్తాన్నీ రద్దు చేసింది.
బీసీసీఐ విషయంలోనూ అదే కారణాన్ని చూపుతున్నారు కొందరు నెటిజన్లు. ఇందులో ప్రతిపక్ష కూటమి ఇండియా నేతలు కూడా ఉన్నారు. బీసీసీఐలో ఎప్పటి నుంచో రాజకీయ జోక్యం అధికంగా ఉందని, స్వయంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కుమారుడు జై షా బీసీసీఐ కార్యదర్శిగా వ్యవహరిస్తోన్నారని చెబుతున్నారు.