హరారే: తాను జింబాబ్వేతో జరిగిన రెండో టీ20 మ్యాచ్ ముందు నిద్రలేని రాత్రి గడిపానని భారత యువ బ్యాట్స్మన్ మందీప్ సింగ్ తెలిపాడు. జింబాబ్వే పర్యటనలో ఉన్న టీమిండియా వన్డే సిరీస్ను క్లీన్ స్వీప్ చేసి.. టీ20 టోర్నీలో భాగంగా జరిగిన తొలి మ్యాచ్లోనే ఓటమి పాలైంది. దీంతో తమపై తీవ్ర ఒత్తిడి పెరిగిందని చెప్పాడు మందీప్.
రెండో టీ20మ్యాచ్ కోసం మైదానంలో అడుగుపెట్టిన సమయంలో కొంత ఒత్తిడికి గురైనట్లు తెలిపాడు. అయితే, ఈ మ్యాచ్లో మందీప్ సింగ్ అర్ధ శతకం(52)తో రాణించి టీమిండియా విజయం కీలక పాత్ర పోషించాడు.
'రెండో టీ20 మ్యాచ్ ముందు నాకు నిద్రపట్టలేదు. దీంతో ఆ రోజు నేను నిద్రకు దూరమయ్యా. ఒక మ్యాచ్ లేదా సిరీస్ గెలిచిన సమయంలో సెలక్టర్లు ఆటగాళ్ల ప్రతిభను గమనిస్తుంటారు. దీంతో మైదానంలో అడుగుపెట్టే ముందు కూడా ఒత్తిడికి గురికావాల్సి వస్తుంది. లక్ష్యం 100 పరుగులుగా పెట్టుకుని నేను ముందుకు సాగాను' అని మందీప్ తెలిపాడు.
'ఈ సిరీస్ మనకు ఎంతో ముఖ్యం. సెలక్టర్లు చూస్తున్నారనేది తర్వాత విషయమని ఆలోచించా. జట్టు గెలుపు కోసం నా వంతు కృషి చేయాలని అనుకున్నా. అయితే, మైదానంలోకి అడుగుపెట్టిన తర్వాత ఒత్తిడినంతా మర్చిపోయాను' అని మందీప్ చెప్పాడు.
తొలి మ్యాచ్ ఓటమి కొంత ఆందోళన కలిగించిందని, సిరీస్ దక్కించుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యచ్ కావడంతో కొంత ఒత్తిడి పెరిగిందని అన్నాడు. అయితే, ఎలాగైనా సిరీస్ దక్కించుకోవాలనే పట్టుదలతో ఆడినట్లు చెప్పాడు. దీంతో సమష్టిగా రాణించి.. రెండో టీ20మ్యాచ్లో గెలిచి సిరీస్ ను 1-1తో సమం చేసినట్లు తెలిపాడు.
ఫలితం గురించి ఆలోచించకుండా మ్యాచ్ లో బాగా ఆడాలని అనుకున్నామని తెలిపాడు. అయితే, సిరీస్ దక్కించుకోవాలనే పట్టుదలతో ముందుకు సాగామని తెలిపాడు. తొలి మ్యాచ్లో చేసిన పొరపాట్లు జరగకుండా చూసుకున్నామని చెప్పాడు.
'కొందరు జట్టు సభ్యులు సినిమాకెళ్లారు. మేమంతా ఫిఫా ఆడాం. మేమంతా నిన్న కొంచెం విశ్రాంతి తీసుకున్నాం. తొలి మ్యాచ్ కంటే చాలా మెరుగ్గా ఆడటంతోనే రెండో మ్యాచ్ విజయం సులభమైంది' అని తెలిపాడు మందీప్ సింగ్.