హైదరాబాద్లో జరిగిన మూడో టీ20లో ఆస్ట్రేలియాపై ఉత్కంఠ భరిత విజయం తర్వాత.. భారత్ మరో సిరీస్ను కైవసం చేసుకుంది. ఇక ఈ విజయం తర్వాత టీ20 ఫార్మాట్లో భారత్ తమ ఆధిపత్యాన్ని మరింత పదిలం చేసుకుంది. టీ20 ప్రపంచకప్ 2021 నుండి.. భారతదేశం ఇప్పటివరకు ఒక్క ద్వైపాక్షిక టీ20 సిరీస్ను కోల్పోలేదు.
రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత్ ఆసియాకప్ మినహా మిగతా సిరీస్లన్నింటిలో గెలిచింది. తాజాగా ఐసీసీ మెన్స్ టీ20 టీం ర్యాంకింగ్స్లో భారత్ ర్యాంకింగ్ పాయింట్లు పెరిగాయి. దీంతో నంబర్ 1 ర్యాంకు మరింత పదిలమైంది. ఇకపోతే ర్యాంకింగ్స్లో ఆరో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా.. భారత్తో సిరీస్ ఓడిపోయిన తర్వాత ఒక పాయింట్ను కోల్పోయిన్నప్పటికీ సేమ్ ర్యాంకులో ఉంది.
ఈ సిరీస్ విజయం తర్వాత భారత్ ఓవరాల్గా 268పాయింట్లతో నంబర్ 1 ర్యాంకులో ఉండగా.. 261పాయింట్లతో ఇంగ్లాండ్ రెండో స్థానంలో ఉంది. ఇంగ్లాండ్ ప్రస్తుతం పాకిస్థాన్లో ఏడు మ్యాచ్ల టీ20 సిరీస్ను ఆడుతోంది. ప్రస్తుతం సిరీస్ 2-2తో సమంగా ఉంది. ఇకపోతే దక్షిణాఫ్రికా 3వ స్థానంలో, పాకిస్తాన్ 4వ స్థానంలో ఉంది. ఇరు జట్లు ప్రస్తుతం 258పాయింట్లతో కొనసాగుతున్నాయి.
ఇకపోతే టీ20 ర్యాంకింగ్స్లో 5వ స్థానంలో న్యూజిలాండ్, 7వ స్థానంలో వెస్టిండీస్, 8వ స్థానంలో శ్రీలంక, 9వ స్థానంలో బంగ్లాదేశ్, 10వ స్థానంలో ఆఫ్ఘనిస్థాన్ ఉంది. సెప్టెంబర్ 28నుంచి దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఆడబోతుంది. భారత్ స్వదేశంలో మరో సిరీస్ విజయాన్ని పూర్తి చేయగలిగితే.. నంబర్ 1 ర్యాంకు టీ20 జట్టుగా ఆస్ట్రేలియాలో జరగబోయే టీ20 ప్రపంచకప్ - 2022లోకి భారత్ అడుగుపెడుతుంది.
ఇకపోతే సూర్యకుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీలతో చెలరేగిన నేపథ్యంలో భారత్ డిసైడర్ మ్యాచ్లో గెలుపొందింది. సిరీస్ ప్రారంభంలో 0-1తో భారత్ వెనకబడింది. అయితే చివరి రెండు గేమ్లలో భారత్ బలంగా పుంజుకుని సిరీస్ కైవసం చేసుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ చివరి మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. హైదరాబాద్ నాకు చాలా ప్రత్యేక స్థానం. టీమిండియా తరఫున అలాగే డెక్కన్ ఛార్జర్స్ తరఫున చాలా జ్ఞాపకాలను ఇక్కడ కలిగి ఉన్నాం. ఇది చాలా గొప్ప సందర్భం. మేము భారీ ప్రదర్శన ఇవ్వాలనుకున్నాం. మేము అనుకున్నట్లే సరిగ్గా అమలు చేశాం. ' అని రోహిత్ పేర్కొన్నాడు.