దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ఛైర్మన్గా శశాంక్ మనోహర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు శశాంక్ ఎన్నికను ఐసీసీ గురువారం ప్రకటించింది. రెండు రోజుల క్రితమే శశాంక్ బీసీసీఐ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
కాగా, ఐసీసీ తొలి స్వతంత్ర ఛైర్మన్ శశాంక్ మనోహర్ కావడం విశేషం. శశాంక్ గత మంగళవారం బీసీసీఐ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. బీసీసీఐతో పాటు ఆసియా క్రికెట్ కౌన్సిల్ పదవులకు కూడా ఆయన రాజీనామా చేశారు.
ఐసీసీ స్వతంత్ర ఛైర్మన్గా పోటీ చేయడం కోసం ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. నిబంధనల ప్రకారం.. ఐసీసీ బరిలో నిలవాలంటే సొంత క్రికెట్ బోర్డుతో అతడికి ఎలాంటి సంబంధాలు ఉండకూడదు.
గతంలోమాదిరిగా కాకుండా ఐసీసీ అధ్యక్ష ఎన్నికలో ఇటీవల కొన్ని సవరణలు చేశారు. వాటి ప్రకారం.. వంతుల వారీగా ఏదో ఒక బోర్డు నామినేట్ చేయడానికి వీల్లేదు. ఐసీసీ డైరెక్టర్లలో ఒకరు పోటీపడే వ్యక్తి పేరును ప్రతిపాదించాలి. కనీసం రెండు సభ్యదేశాల మద్దతు ఉండాలి.
శశాంక్కు ఐసీసీ డైరెక్టర్ల మద్దతుండటంతో పోటీ చేసి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
2008 నుంచి 2011వరకు శశాంక్ బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్నారు. నిరుడు జగ్మోహన్ దాల్మియా మృతితో రెండోసారి ఈ పదవిలోకి వచ్చారు. అయితే అధికారంలోకి వచ్చిన ఏడు నెలలకే ఐసీసీ ఎన్నికల నేపథ్యంలో శశాంక్ రాజీనామా చేయాల్సి వచ్చింది. కాగా, ఐసిసి ఛైర్మన్గా శశాంక్ రెండేళ్లపాటు కొనసాగనున్నారు.
ఈ సందర్భంగా శశాంక్ మనోహర్ మాట్లాడుతూ.. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసిసి)కి అధ్యక్షుడిగా ఎన్నిక కావడం ఆనందంగా ఉందన్నారు. తన శక్తి, సామర్థ్యాలపై నమ్మకం ఉంచిన డైరెక్టర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. బిసిసిఐ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో తనకు సహకరించిన వారికి కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అంతర్జాతీయ క్రికెట్లు నేటి తరానికి తగినట్లుగా మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని మనోహర్ చెప్పారు.