
చెన్నై: టీమిండియా మాజీ కేప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యాన్ని వహిస్తోన్న చెన్నై సూపర్ కింగ్స్ను కరోనా వైరస్ వదలట్లేదు. ఆ జట్టు బ్యాటింగ్ కోచ్, ఆస్ట్రేలియా మాజీ దిగ్గజ క్రికెటర్ మైక్ హస్సీ కరోనా బారిన పడ్డారు. ఆయనకు నిర్వహించిన కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్గా తేలింది. దీనితో ఆయన ఐసొలేషన్లోకి వెళ్లారు. హస్సీ కంటే ముందు ఆ జట్టు బౌలింగ్ కోచ్ లక్ష్మీపతి బాలాజీకి కరోనా వైరస్ సోకింది. బాలాజీ ప్రస్తుతం ఐసొలేషన్లో ఉంటున్నారు.
బ్యాటింగ్ కోచ్ కావడం వల్ల మైక్ హస్సీ నెట్స్లో ఆ జట్టు బ్యాట్స్మెన్లందరికీ మెళకువలు నేర్పించేవాడు. నెట్ ప్రాక్టీస్ను దగ్గరుండి పర్యవేక్షించేవాడు. ఎంఎస్ ధోనీ, సురేష్ రైనా, అంబటి రాయుడు సహా చెన్నై సూపర్ కింగ్స్కు చెందిన టాప్ బ్యాట్స్మెన్లకు ఆయన వద్ద నెట్ ప్రాక్టీస్ చేసినవారే. అలాంటి హస్సీ కరోనా వైరస్ బారిన పడటం తాజాగా ఆ జట్టు మేనేజ్మెంట్లో కలకలం రేపుతోంది. ప్రస్తుతం ఆ జట్టు మొత్తం ఐసొలేషన్లోకి వెళ్లింది. వారికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలను నిర్వహించారు.
ఇప్పటికే కోల్కత నైట్ రైడర్స్, సన్రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ కేపిటల్స్ జట్లల్లో కరోనా భూకంపం పుట్టించింది. ఆయా జట్లకు చెందిన నలుగురు ఆటగాళ్లు వైరస్కు గురయ్యారు. కోల్కత నైట్ రైడర్స్ మీడియం పేసర్ వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్ కరోనా బారిన పడ్డారు. సన్రైజర్స్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ వృద్ధిమాన్ సాహా కోవిడ్ పాజిటివ్గా తేలాడు. ఢిల్లీ కేపిటల్స్ స్పిన్నర్ అమిత్ మిశ్రా సైతం కరోనా సోకడంతో ఐసొలేషన్లోకి వెళ్లాడు.
ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఐపీఎల్ 2021 సీజన్ మొత్తాన్నీ సస్పెండ్ చేసింది. నిరవధికంగా వాయిదా వేసింది. మళ్లీ ఈ మెగా టోర్నమెంట్ను ఎప్పుడు నిర్వహిస్తారనేది వెల్లడించలేదు. ఈ ఏడాది అక్టోబర్లో నిర్వహించే టీ20 ప్రపంచకప్ తరువాత ఐపీఎల్లో మిగిలిన మ్యాచ్లను కొనసాగింపజేస్తారని తెలుస్తోంది. దీన్ని బీసీసీఐ ఇంకా ధృవీకరించలేదు. ఈ రెండు టోర్నమెంట్లు కూడా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఉండొచ్చంటూ ప్రాథమికంగా వార్తలు అందుతున్నాయి.