న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా ఆదివారం కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం రాత్రి గుండె సంబంధిత సమస్యతో కోల్కత్తాలోని కేఎం బిర్లా ఆసుపత్రిలో తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే.
ప్రపంచ క్రికెట్లో బీసీసీఐకి ఆర్థిక జవసత్వాలు అందించడమే కాక ఆ సంస్థను ప్రపంచంలోనే ధనిక బోర్డుగా మలచడంలో దాల్మియాదే కీలక పాత్ర పోషించారు. సుదీర్ఘ అనుభవం ఉన్న దాల్మియా మరణం తర్వాత బోర్డు పగ్గాల చేపట్టేదెవరు?ఇదే ప్రశ్న ఇప్పుడు దేశవ్యాప్తంగా క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
బీసీసీఐ నిబంధనల ప్రకారం అధ్యక్షుడు మధ్యలోనే పదవికి దూరమైతే కొత్త అధ్యక్షుడి ఎన్నిక కోసం బోర్డు కార్యదర్శి 15 రోజుల్లోగా బోర్డును సమావేశపరిచి, కొత్త అధ్యక్షుడి ఎన్నికకు చర్యలు తీసుకోవాల్సింది. అధ్యక్షుడిని నామినేట్ చేసే అధికారం ఉన్న జోన్ సభ్యుల అభీష్టం మేరకు తాత్కాలిక అధ్యక్షుడిని ఎన్నుకోవాలి. బోర్డు సభ్యుల నిర్ణయం ప్రకారం ఎన్నికలు జరిగే వరకు తాత్కాలిక అధ్యక్షుడే పదవిలో ఉంటారు.

దీంతో ప్రస్తుతం కార్యదర్శి పదవిలో ఉన్న లోక్ సభ సభ్యుడు అనురాగ్ ఠాకూర్ తీసుకునే నిర్ణయంపై క్రీడాలోకం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. నిబంధనల మేరకు ఠాకూర్ సమావేశం ఏర్పాటు చేస్తారా? లేక సుప్రీంకోర్టు ఆదేశాల కోసం ఎదురు చూస్తారా? అన్న అంశంపై ఆసక్తి నెలకొంది.
ప్రస్తుతం బోర్డు ఉపాధ్యక్షుడిగా, ఐపీఎల్ ఛైర్మన్గా ఉన్న రాజీవ్ శుక్లా ఈ పదవికి రేసులో అందరికన్నా ముందు వరుసలో రాజీవ్ శుక్లా ఉన్నారు. ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న ఈ కాంగ్రెస్ నేతకు ఈశాన్య రాష్ట్రాల బోర్డుల మద్దతు లభించాల్సి ఉంది.
మరో ఉపాధ్యక్షుడు గ్వాలియర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గౌతం రాయ్ పేరు కూడా వినిపిస్తున్నప్పటికీ ఆయనకు బీసీసీఐలో మెజారిటీ మద్దతు లేదు. ఢిల్లీ బోర్డు అధ్యక్షుడిగా ఉన్న సీకే ఖన్నా పరిస్థితి కూడా అలానే ఉంది. దీంతో ఠాకూర్ కే చైర్మన్ పదవి లభించడం ఖాయమని తెలుస్తోంది.