ఐపీఎల్-2024 సీజన్ ముగిసిన అనంతరం రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ ప్రాంఛైజీని వీడనున్నాడని జాతీయ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుత ముంబై జట్టులోని ఒకరు ఈ విషయాన్ని మీడియాకు లీక్ చేశారని కథనాలు వస్తున్నాయి. కెప్టెన్సీ మార్పు, హార్దిక్ పాండ్యతో భిన్నాభిప్రాయాల కారణాలతో రోహిత్ అసంతృప్తిగా ఉన్నాడని సదరు ఆటగాడు వెల్లడించాడని పేర్కొన్నాయి.
అంతేగాక వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్ మెగా వేలంలో రోహిత్ శర్మ పాల్గొననున్నట్లు సమాచారం. ఈ సీజన్ ముగిసిన అనంతరం ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్లలో ముగ్గురు లేదా నలుగురిని మాత్రమే రిటైన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ జాబితాలో ముంబై తరఫున జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్య, సూర్యకుమార్ యాదవ్ హాట్ ఫేవరేట్గా ఉంటారని అందరికీ తెలిసిందే. అయితే ముంబై ఫ్రాంచైజీతో కొనసాగడానికి రోహిత్ శర్మ ఇష్టపడకపోతే రోహిత్ స్థానంలో తిలక్ వర్మ లేదా విదేశీ ప్లేయర్ను అంటిపెట్టుకునే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.

కాగా, వేలానికి ముందు గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్యను ట్రేడ్ చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ట్రేడ్కు ముందు కెప్టెన్సీ ఒప్పందంతోనే హార్దిక్ ముంబై గూటికి చేరాడని కథనాలు వచ్చాయి. మరోవైపు రోహిత్ శర్మను బలవంతంగా సారథి బాధ్యతలు నుంచి తప్పించాడని ప్రచారం జోరుగా సాగింది. అయిదు టైటిళ్లు అందించిన రోహిత్ శర్మను కాదని హార్దిక్ను కెప్టెన్ చేయడంపై జట్టులో బయటా అసంతృప్తి మొదలైంది.
ఈ నేపథ్యంలో హార్దిక్ను రోహిత్ అభిమానులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. స్టేడియంలో హార్దిక్ను హేళన చేస్తున్నారు. అంతేగాక ముంబై జట్టులో రెండు గ్రూప్లు ఏర్పడ్డాయని వార్తలు వస్తున్నాయి. రోహిత్ మద్దతుదారులు ఓ వర్గంగా ఏర్పడ్డారని, అందులో జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ వంటి స్టార్ ప్లేయర్లు ఉన్నారని కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. హార్దిక్-రోహిత్ కెప్టెన్సీ వివాదంపై మాజీ క్రికెటర్లు కూడా చర్చలు మొదలుపెట్టారు. హార్దిక్ను కెప్టెన్గా కొనసాగిస్తారని కొందరు మాజీలు అభిప్రాయపడగా, గొడవను సద్దుమణచడానికి రోహిత్కు తిరిగి సారథి బాధ్యతలు అందిస్తారని మరికొందరు తమ వాదన వినిపిస్తున్నారు.