మరో రెండు వారాల్లో ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీలో.. రోహిత్ శర్మ నాయకత్వంలో టీమిండియా బరిలోకి దిగనుంది. అయితే గతేడాది టీ20 వరల్డ్ కప్ తర్వాత పొట్టి ఫార్మాట్కు రోహిత్ గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత రోహిత్ ఇలాంటి సంచలన నిర్ణయమే తీసుకుంటాడని తెలుస్తోంది. ఎందుకంటే టీమిండియా భవిష్యత్ సారథ్యంతో పాటు వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2025-27 సీజన్, 2027 వన్డే వరల్డ్ కప్ కోసం జట్టును సిద్ధం చేసేందుకు బీసీసీఐ సమయాత్తమవుతోంది. ఇందుకోసం.. రోహిత్ తన భవిష్యత్తు ప్రణాళికలపై స్పష్టత ఇవ్వాలని బీసీసీఐ అతడిని అడిగినట్లు సమాచారం.
వాస్తవానికి ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ జరిగే సమయంలోనే రోహిత్ రిటైర్మెంట్ ప్రకటిస్తారని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. మరి కొంత కాలం కెప్టెన్ గా, ప్లేయర్ గా సాగుతానని, ఆ తర్వాత భవిష్యత్ నిర్ణయం గురించి చెబుతానని.. రోహిత్ బీసీసీఐకి చెప్పినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఈ విషయమై నిర్ణయం తీసుకోబోతున్నాడని సమాచారం అందింది.

ఒకవేళ అంతర్జాతీయ క్రికెట్కు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటిస్తే.. అతడి స్థానంలో రెండు ఫార్మాట్లకు (వన్డే, టెస్ట్) సారథులను నియమించాలి. టెస్టులకు బుమ్రా, పంత్, యశస్వి జైస్వాల్ పేర్లను పరిశీలిస్తుండగా... వన్డేలకు గిల్, పంత్ పేరును పరిశీలిస్తున్నారట.
"గత సెలక్షన్ కమిటీ మీటింగ్ లో రోహిత్ శర్మతో సెలక్టర్లు, బోర్డు సభ్యులు చర్చలు జరిపారు. అప్పుడు అతడు ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత తన భవిష్యత్ ప్రణాళికలను ఎంటనేది చెప్పడానికి కాస్త సమయం కావాలని అడిగాడు. నెక్ట్స్ డబ్ల్యూటీసీ సైకిల్ తో పాటు వన్డే వరల్డ్ కప్ కోసం మేనేజ్మెంట్ కొన్ని ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. దీని కోసం ప్రతి ఒక్కరితో చర్చలు జరిపి, వారి అభిప్రాయలను తెలుసుకుని.. ఈ ప్రక్రియను సుజావుగా సాగేలా చూడాలనేదే బోర్డు ఉద్దేశ్యం. కెప్టెన్సీ విషయానికొస్తే.. బుమ్రాకు పగ్గాలు అప్పజెప్పడం డౌటే. ఎందుకంటే నిలకడగా ఉండే ప్లేయర్ వైపే మేనేజ్ మెంట్ మొగ్గు చూపేందుకు ఆలోచిస్తోంది. గిల్ పేరును పరిశీలించారు కానీ.. టెస్టులో అతడి ప్రదర్శన యావరేజ్ గా ఉంది. రిషభ్ పంత్ కూడా బలమైన అభ్యర్థే. అతడితో పాటు యశస్వి పేరును కూడా పరిశీలిస్తున్నారు." అని ఓ బీసీసీఐ అధికారి పేర్కొన్నారు.