న్యూఢిల్లీ: గత కొంత కాలంగా ఫాం కోల్పోయి సతమతమవుతున్న ఆస్ట్రేలియా ఆటగాడు గ్లేన్ మాక్స్వెల్ శ్రీలంకతో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో 145 పరుగులతో విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. కాగా, మాక్స్వెల్ ఇన్సింగ్స్పై భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ప్రముఖ వ్యాఖ్యాత హర్షా బోగ్లే ఈ ఇన్నింగ్స్ పై చేసిన ట్వీట్పై భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందిస్తూ.. నాలుగు ఓవర్ల బౌలింగ్ పవర్ ప్లేలో రెండు ఓవర్లను టెన్నిస్ బంతితో బౌలింగ్ చేయాలని, మరో రెండు ఓవర్లను బౌలర్ ఆపరేట్ చేసే బౌలింగ్ మేషిన్తో వేయాలని అశ్విన్ రీట్వీట్ చేశాడు.

బౌలింగ్ మేషిన్తో మాత్రమే మ్యాక్స్ వెల్కు బౌలింగ్ చేయగలమని అశ్విన్ తన పోస్ట్లో అభిప్రాయపడ్డాడు. కాగా, అంతకుముందు హర్షాబోగ్లే ఆసీస్ ఇన్నింగ్స్పై ఈ విధంగా ట్వీట్ చేశాడు..' 10 ఓవర్లలో 153 పరుగులు.. అది కూడా 39 బంతుల్లో సెంచరీ భాగస్వామ్యం.. మ్యాక్స్వెల్ 145నాటౌట్(65బంతులు)?.. హెడ్ 263 స్ట్రైక్ రేట్ తో (18 బంతుల్లో 45) చేశాడు. తర్వాత ఏంటి? ఇంకేవరైనా బౌలర్ సిద్ధంగా ఉన్నారా?' అని సవాల్ విసిరాడు.
కాగా, శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో 49 బంతుల్లో సెంచరీ చేసిన మ్యాక్స్ వెల్ (65 బంతుల్లో 145 నాటౌట్: 14 ఫోర్లు, 9 సిక్సర్లు) వీర బాదుడుకు లంక బౌలర్లు బెంబెలెత్తిపోయారు. దీంతో టీ20ల్లో గతం(2007)లో లంక పేరిట ఉన్న రికార్డు (కెన్యాపై 260 పరుగులు)ను తిరగరాస్తూ 20 ఓవర్లలోనే 3 వికెట్ల నష్టానికి ఆసీస్ జట్టు 263 పరుగులు చేసింది.