భారతీయుడిగా దేశానికి ఏది మంచిదో అదే చేస్తాం
'ఓ భారతీయుడిగా దేశానికి ఏది మంచిదో అదే చేస్తాం. కొన్ని అంశాలపై స్పందించాలా వద్దా అన్నది వాళ్ల వ్యక్తిగత విషయం. ఓ అంశంపై పూర్తి అవగాహన లేకుండా నేను మాట్లాడను. కానీ నా వరకు దేశ ప్రయోజనాలే ముందుంటాయి' అని విరాట్ కోహ్లీ ట్విట్టర్లో పేర్కొన్నాడు.
అసలేం జరిగింది?
గత ఆదివారం కశ్మీర్లో భారత బలగాలు 13 మంది టెర్రరిస్టులను మట్టుబెడితే.. ఇండియా ఆక్రమిత కశ్మీర్లో అమాయకులను అణచివేస్తున్నారంటూ అఫ్రిది తన ట్విటర్లో పేర్కొన్నాడు. ‘భారత్ ఆక్రమించిన కశ్మీర్లో పరిస్థితి దారుణంగా ఉంది. అణచివేత పాలనకు వ్యతిరేకంగా స్వాతంత్ర్యం కోసం తమ గళాన్ని వినిపిస్తున్న అమాయక ప్రజలు అన్యాయంగా తుపాకీ తూటాలకు బలైపోతున్నారు. ఈ హింసను ఐక్యరాజ్యసమితి, ఇతర స్వచ్ఛంద సంస్థలు ఎందుకు అడ్డుకోలేకపోతున్నాయి' అని ట్వీట్ చేశాడు.
తనదైన శైలిలో గంభీర్ పంచ్
అఫ్రిది వ్యాఖ్యలపై భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ అంశంపై టీమిండియా వెటరన్ క్రికెటర్ గంభీర్ తనదైన శైలిలో అఫ్రిదికి పంచ్ ఇచ్చాడు. అఫ్రిది వ్యాఖ్యలను అంతగా పట్టించుకోనక్కరలేదని, అతను నోబాల్తో వికెట్ తీసి సంబరాలు చేసుకుంటున్నాడని గంభీర్ గట్టిగా పంచ్ ఇచ్చాడు. ‘అఫ్రిది ట్వీట్పై నన్ను స్పందించాల్సిందిగా మీడియా అడిగింది. దీనిపై ఏం స్పందించాలి? బుద్ధిమాంద్యం ఉన్న అతని దృష్టిలో యూఎన్ అంటే అండర్ 19 అని అర్థం. మీడియా దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అఫ్రిది నోబాల్తో వికెట్ తీసి ఆనందపడుతున్నాడు.' అని వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు.
అఫ్రిది ఎవరని ప్రశ్నించిన కపిల్ దేవ్
మరోవైపు అప్రిది వ్యాఖ్యలపై లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ కూడా స్పందించాడు. అఫ్రిది ఎవరు అంటూ అతను ప్రశ్నించాడు. అతనికి ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తున్నారు.. అలాంటి వ్యక్తులను పట్టించుకోవద్దు అని కపిల్ తన ట్విట్టర్లో ట్వీట్ చేశాడు.
కశ్మీర్ ఎప్పటికీ భారత్లోని అంతర్భాగమే
‘కశ్మీర్ ఎప్పటికీ భారత్లోని అంతర్భాగమే. కశ్మీర్ నా పూర్వీకులు జన్మించిన పవిత్ర భూమి. కశ్మీర్లో ఉగ్రవాదాన్ని నియంత్రించేలా అఫ్రిది భాయ్ పాకిస్థాన్ ఆర్మీని అడగాలి. మేము ఎప్పుడూ శాంతినే కోరుకుంటాం. రక్తపాతాన్ని, ఆందోళనలను ఎంతమాత్రం అంగీకరించబోము' అని రైనా తన ట్వీట్లో పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications













