
హైదరాబాద్: ఇంగ్లాండ్ ప్రపంచకప్ విశ్వవిజేతగా నిలవడంతో మూడేళ్ల తర్వాత సెహ్వాగ్పై బ్రిటీష్ జర్నలిస్ట్ పియర్స్ మోర్గాన్ రివేంజ్ తీర్చుకున్నాడు. రియో ఒలింపిక్స్ సందర్భంగా టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, ప్రముఖ బ్రిటీష్ జర్నలిస్ట్ పియర్స్ మోర్గాన్ల మధ్య ట్విట్టర్ వార్ జరిగిన సంగతి తెలిసిందే.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
రియో ఒలింపిక్స్లో భారత్ నుంచి పీవీ సింధు, సాక్షిమాలిక్లు పతకాలను సాధించిన సంగతి తెలిసిందే. దీంతో వారిద్దరూ స్వదేశానికి తిరిగి రాగానే వారికి అభిమానులు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఈ వెల్ కమ్కు సంబంధించిన ఫోటోలను పియర్స్ మోర్గాన్ ట్విట్టర్లో ట్వీట్ చేస్తూ వ్యంగ్యంగా స్పందించాడు.
"125 కోట్ల మంది జనాభా ఉన్నా.. కేవలం రెండు పతకాలు సాధించి దానికే సంబరాలు ఎందుకు చేసుకుంటున్నారు" అంటూ పియర్స్ మోర్గాన్ వ్యాఖ్యానించాడు. దీనికి ట్విట్టర్ ద్వారానే సెహ్వాగ్ ఘాటుగా జవాబు ఇచ్చారు.
ముందుగా మోర్గాన్ చేసిన ట్వీట్కు సమాధానంగా.. 'భారతీయులు ప్రతి చిన్న విషయానికీ ఆనందిస్తూనే ఉంటారు' అని సెహ్వాగ్ ట్వీట్ చేశారు. ఆ తర్వాత 'అది సరేగానీ, క్రికెట్ను కనుగొన్నది తామేనంటూ జబ్బలు చరుచుకునే ఇంగ్లాండ్ ఇంతవరకు ఒక్కసారి కూడా ప్రపంచకప్ గెలవలేదు. అయినా ఇప్పటికీ ప్రపంచకప్లో ఆడుతూనే ఉండటం ఇబ్బందికరంగా ఏమీ లేదా' అని మోర్గాన్ చెంప ఛెళ్లుమనిపించేలా మరో ట్వీట్ చేశారు సెహ్వాగ్.
అయితే అది అక్కడితో ఆగలేదు. సెహ్వాగ్ ట్వీట్కు మోర్గాన్ మరోసారి స్పందించాడు. కెవిన్ పీటర్సన్ ఆడి ఉంటే, ఇంగ్లాండ్ తప్పనిసరిగా ప్రపంచకప్ గెలిచేదని చెప్పాడు. కానీ, హనుమంతుడి ముందు కుప్పగంతులా అన్నట్లు క్రికట్ గురించి సెహ్వాగ్కు చెబితే ఎలా? అందుకే వీరూ దానికి కూడా గట్టిగానే చెప్పాడు.
అసలు పీటర్సన్ ఇంగ్లాండ్ వ్యక్తి కాదని, దక్షిణాఫ్రికాలో పుట్టాడని, అందులోనూ ఆయన 2007 ప్రపంచకప్లో ఆడాడని.. అయినా ఇంగ్లండ్ ఓడిపోయిందని చకచకా చెప్పేశాడు. దాంతో ఇక మోర్గాన్ మాట్లాడేందుకు ఏమీ లేక నోరు మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇటీవల ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ప్రపంచకప్లో ఆతిథ్య జట్టు ఇంగ్లాండ్ తొలిసారి విశ్వవిజేతగా నిలిచింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 241 పరుగులు చేసింది. అనంతరం 242 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ సైతం నిర్ణీత 50 ఓవర్లలో 241 పరుగులే చేయడంతో మ్యాచ్ టైగా ముగిసింది.
అనంతరం మ్యాచ్ ఫలితం రాబట్టేందుకు సూపర్ ఓవర్ నిర్వహించగా ఇరు జట్లు 15 పరుగులతో సమానంగా నిలిచాయి. దీంతో బౌండరీ రూల్ ఆధారంగా ఇంగ్లాండ్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్కు ఇదే మొట్టమొదటి ప్రపంచకప్. తాజాగా, ఇంగ్లాండ్ కూడా వరల్డ్కప్ గెలవడంతో మూడేళ్ల క్రితం సెహ్వాగ్ చేసిన ట్వీట్కు పియర్స్ మోర్గాన్ ఇప్పుడేమంటావ్ మేట్! అంటూ రీట్వీట్ చేశాడు.