31 పరుగుల తేడాతో భారత్ ఓటమి
రెండో ఇన్నింగ్స్లో టీమిండియా కచ్చితంగా గెలుస్తుందని అనుకున్న తరుణంలో విరాట్ కోహ్లీని ఔట్ చేసి మ్యాచ్ని ఇంగ్లాండ్వైపుకి బెన్స్టోక్స్ తిప్పిన సంగతి తెలిసిందే. కోహ్లీ ఔటైన తర్వాత టీమిండియా వరుసగా వికెట్లను కోల్పోయి 31 పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఇరు జట్ల మధ్య రెండో టెస్టు గురువారం నుంచి లార్డ్స్ వేదికగా జరగనుంది.
బెన్ స్టోక్స్ మాట్లాడుతూ
ఈ నేపథ్యంలో బెన్ స్టోక్స్ మాట్లాడుతూ "ఉత్కంఠ మ్యాచ్ల్లో గెలిస్తే.. ఆ విజయం జట్టు ఆత్మవిశ్వాసాన్ని కచ్చితంగా రెట్టింపు చేస్తుంది. ఐదు టెస్టుల సిరీస్ ఆడుతున్నప్పుడు ఆరంభంలో మెరుగైన ప్రదర్శన చేయడం చాలా ముఖ్యం. ఇంగ్లాండ్ జట్టు అదే చేసింది. సిరీస్ ఆరంభానికి ఇంతకంటే ఏం కావాలి? ఇప్పుడు ఇంగ్లాండ్ జట్టులో ఆత్మవిశ్వాసం పెరిగింది. సిరీస్ మొత్తం అది కొనసాగుతుంది" అని బెన్స్టోక్స్ అన్నాడు.
హాఫ్ సెంచరీ తర్వాత కోహ్లీని ఔట్ చేసిన స్టోక్స్
తొలి ఇన్నింగ్స్లో 149 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ.. రెండో ఇన్నింగ్స్లోనూ 51 పరుగులతో హాఫ్ సెంచరీ పూర్తి చేసి టీమిండియాకు విజయాన్ని అందించేలా కనిపించాడు. అయితే, కోహ్లీని వికెట్ల మందు దొరకబుచ్చుకున్న బెన్స్టోక్స్ ఒక్కసారిగా మ్యాచ్ను భారత్ చేతుల్లోంచి అమాంతం లాగేసుకున్నాడు.
రెండో టెస్టుకు బెన్ స్టోక్స్ దూరం
కాగా, లార్డ్స్ వేదికగా జరిగే రెండో టెస్టుకు బెన్ స్టోక్స్ దూరమయ్యాడు. గతేడాది నవంబర్లో బ్రిస్టల్లోని ఓ పబ్లో ఇద్దరు వ్యక్తులపై బెన్ స్టోక్స్ పిడి గుద్దులు కురిపించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన కేసు బ్రిస్టల్ క్రౌన్ కోర్టులో సోమవారం విచారణకు రానుంది. ఈ విచారణ కారణంగా బెన్ స్టోక్స్ లార్డ్స్ టెస్టుకు దూరమయ్యాడు.