హైదరాబాద్: రాంచీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టు చివరి రోజున మ్యాచ్ బంతి నాణ్యతపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. మ్యాచ్ అనంతరం ప్రజంటేషన్ కార్యక్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ అడిగిన ప్రశ్నకు గాను కోహ్లీ పైవిధంగా స్పందించాడు.
కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ చివరిరోజు రాంచీ పిచ్పై ఉన్న పాచెస్ వల్లే టీమిండియా స్పిన్నర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్లు వికెట్లు తీయలేకపోయారా? అని కోహ్లీని అడిగాడు. ఇందుకు కోహ్లీ చివరిరోజు వికెట్ బౌలర్లకు సహకరించలేదని తాను అనుకోవడం లేదన్నాడు.
మ్యాచ్ బంతి నాణ్యతలోనే ఏదో తేడా ఉందని అన్నాడు. పిచ్ను తాకినప్పుడు బంతి అనుకున్నంత పైకి లేవలేదని కోహ్లీ తెలిపాడు. మూడో సెషన్లో తాము అందుకున్న బంతి కూడా ప్రామాణానికి తగ్గట్టుగా లేదని కోహ్లీ పేర్కొన్నాడు. బంతి గట్టిగా లేనట్లైతే పేస్ వికెట్ను రూపొందించేలా బౌలింగ్ చేయడం కష్టమని పేర్కొన్నాడు.

కాగా, రెండో ఇన్నింగ్స్ 71వ ఓవర్లో అంఫైర్లు భారత్కు కొత్త బంతిని ఇచ్చారు. కొత్త బంతిని అందుకున్న తర్వాత భారత బౌలర్లు ఆసీస్ వికెట్లను తీయడంలో పూర్తిగా విఫలమయ్యారు. కొత్త బంతిని అందుకున్న తర్వాత 40 ఓవర్లు చాలా పేలవంగా సాగాయి. భారత బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు.
కాగా, చివరి రోజు ఆటలో ఆసీస్ ఆటగాళ్లు షాన్ మార్ష్- పీటర్ హ్యాండ్స్ కోంబ్లు భారత విజయానికి అడ్డుగోడగా నిలిచారు. చివరి రోజు ఆట తొలి సెషన్ చివర్లో వచ్చిన ఈ ఇద్దరూ చివరి సెషన్లో అర్ధ సెంచరీలు నమోదు చేసి ఆసీస్ను ఆధిక్యంలోకి తీసుకెళ్లారు.
సోమవారం 23/2 ఓవర్నైట్ స్కోరుతో చివరి రోజు ఆట ప్రారంభించిన ఆసీస్ లంచ్ విరామానికి ముందు కెప్టెన్ స్టీవ్ స్మిత్, రెన్ షా వికెట్లు కోల్పోయింది. దీంతో మూడో టెస్టులో భారత్ విజయం సాధిస్తుందని అనుకున్నారు. ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన వీరు క్రీజులో పాతుకుపోయారు.
నెమ్మదిగా ఆడుతూ పరుగులు రాబడుతూ రెండో ఇన్నింగ్స్లో ఆసీస్ను ఆధిక్యంలోకి తీసుకెళ్లారు. రెండు సెషన్ల పాటు ఈ ఇద్దరూ వికెట్ ఇవ్వకుండా భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. టెస్టు ర్యాంకుల్లో నెంబర్ వన్ స్ధానంలో ఉన్న రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలు ఈ జోడీని విడదీసేందుకు తెగ కష్టపడ్డారు.
చివరిరోజు 62 ఓవర్ల పాటు భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నారు. దీంతో మూడో టెస్టు డ్రాగా ముగిసింది. 63 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి ఓటమి అంచులో ఉన్న ఆస్ట్రేలియాను ఈ ఇద్దరూ ఆదుకున్నారు. వీరిద్దరి జోడీ ఐదో వికెట్కు 124 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
దీంతో మూడో టెస్టు మ్యాచ్ చివరకు డ్రాగా ముగిసింది. రాంచీ టెస్టు ఆస్ట్రేలియాకు 800వ టెస్టు మ్యాచ్ కావడం విశేషం. దీంతో అందరి దృష్టి మార్చి 25 నుంచి ధర్మశాలలో ప్రారంభం కానున్న నాలుగో టెస్టుపై పడింది. నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ సిరిస్లో ఇరు జట్లు చెరో టెస్టుని గెలిచి 1-1తో సమంగా ఉన్నాయి.