
పార్ల్లోని బోలాండ్ వేదికగా నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య తొలి వన్డే మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్లో కోహ్లీ చాలా కాలం తర్వాత సాధారణ ప్లేయర్గా బరిలోకి దిగనున్నాడు. దీంతో ఈ మ్యాచ్లో అందరి చూపు విరాట్ కోహ్లీపైనే పడింది. కోహ్లీ ఎలా ఆడనున్నాడు, ఎన్ని పరుగులు చేయబోతున్నాడని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మ్యాచ్లో రాహుల్ కెప్టెన్సీలో బరిలోకి దిగడం ద్వారా విరాట్ కోహ్లీ ఇప్పటివరకు ఎవరెవరి కెప్టెన్సీలో ఆడాడనేది నెట్టింట వైరల్గా మారింది. తన కెరీర్లో విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లోకి మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీలో అడుగుపెట్టాడు. అతని కెప్టెన్సీలోనే వన్డే, టీ20, టెస్టు క్రికెట్లోకి అరంగేంట్రం చేశాడు. ఆ తర్వాత ధోని గైర్హాజరీ సమయంలో సురేష్ రైనా కెప్టెన్గా వ్యవహరించిన మ్యాచ్ల్లోనూ అతని నేతృత్వంలో ఆడాడు. అంతేకాకుండా వీరేంద్ర సెహ్వాగ్, గౌతం గంభీర్ నాయకత్వంలో కూడా పలు మ్యాచ్ల్లో కోహ్లీ ఆడాడు.
ఇక ఆ తర్వాత విరాట్ కోహ్లీనే భారత జట్టు కెప్టెన్గా వ్యవహరించాడు. ఏడేళ్లపాటు అతని కెప్టెన్సీలోనే టీమిండియా ఆడింది. అయితే తాజాగా విరాట్ కోహ్లీ అన్ని ఫార్మాట్లలో టీమిండియా కెప్టెన్సీకి దూరమయ్యాడు. దీంతో చాలా కాలం తర్వాత టీమిండియాలో విరాట్ కోహ్లీ కెప్టెన్గా కాకుండా ఓ సాధారణ ప్లేయర్గా బరిలోకి దిగబోతున్నాడు. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్లోనే ఇది జరగనుంది. ఈ సిరీస్కు కేఎల్ రాహుల్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. దీంతో కెరీర్లో తొలిసారి విరాట్ కోహ్లీ తన జూనియర్ ఆటగాడు అయినా కేఎల్ రాహుల్ నాయకత్వంలో ఆడబోతున్నాడు. అంతేకాకుండా కోహ్లీ ఇన్నేళ్ల తన క్రికెట్ కెరీర్లో తన తర్వాత జట్టులోకి వచ్చిన ఆటగాళ్ల కెప్టెన్సీలో ఆడనుండడం గమనార్హం.
కాగా నేడు జరగనున్న తొలి వన్డేలో గెలిచి సిరీస్లో శుభారంభం చేయాలని భారత జట్టు భావిస్తోంది. ఓపెనర్లుగా కెప్టెన్ రాహుల్కు తోడు వెటరన్ ప్లేయర్ శిఖర్ ధావన్ బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇక ఆల్రౌండర్ కోటాలో వెంకటేష్ అయ్యర్ వన్డేల్లోకి అరంగేంట్రం చేయడం ఖాయంగా తెలుస్తోంది. స్పిన్ కోటాలో సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అడే అవకాశం ఉంది.
భారత్ తుది జట్టు అంచనా:
కేఎల్ రాహుల్ (కెప్టెన్), ధవన్, కోహ్లీ, సూర్యకుమార్, పంత్, వెంకటేశ్ అయ్యర్, దీపక్ చాహర్, భువనేశ్వర్, అశ్విన్, బుమ్రా, చాహల్.
సౌతాఫ్రికా తుది జట్టు అంచనా:
బవుమా (కెప్టెన్), డికాక్, జానెమన్ మలన్, మార్క్రమ్, డుస్సెన్, మిల్లర్, ప్రిటోరియస్, ఫెలుక్వాయో, జాన్సెన్, ఎంగిడి, షంసి.