ఓడిపోతుందనుకున్న ఓవల్ టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ ను మట్టికరిపించింది టీమిండియా. ఇంగ్లాండ్ పర్యటనను ఘన విజయంతో విజయంతో ముగించింది. అయిదు టెస్ట్ మ్యాచ్ ల అండర్సన్- టెండుల్కర్ సిరీస్ ను 2-2తో సమం చేసింది. తిరుగులేదని నిరూపించుకుంది.
చివరి టెస్ట్ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత్ 224 పరుగులు చేయగా.. ఇంగ్లండ్ 247 పరుగులకు ఆలౌటైంది. అనంతరం భారత్ రెండో ఇన్నింగ్స్లో 396 పరుగుల భారీ స్కోర్ చేసి 374 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ స్కోర్ ను అందుకోవడంతో ఇంగ్లాండ్ విఫలమైంది. 367 పరుగుల వద్దే నిలిచిపోయిందా జట్టు ప్రస్థానం.

మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ నిప్పులు చెరిగారు. వికెట్లను పంచుకున్నారు. సిరాజ్ అయిదు వికెట్లతో నేలకూల్చాడు. ప్రసిద్ధ్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఆకాష్ దీప్ ఓ వికెట్ తీసుకున్నాడు. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును కేప్టెన్ శుభ్ మన్ గిల్ దక్కించుకున్నాడు. ఈ సిరీస్ లో అత్యధిక పరుగులు కొట్టాడీ బ్యాటర్.
ఈ గెలుపు.. అలాంటిదిలాంటిది కాదు. మొత్తం ఇంగ్లాండ్ జట్టు వ్యూహాలను తీవ్రంగా ప్రభావితం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇంగ్లాండ్ ప్రధాన ఆయుధం బజ్ బాల్ థియరీ. దీన్ని పూర్తిగా తుడిచిపెట్టినట్టయింది. ఈ నేపథ్యంలో- కెప్టెన్ బెన్ స్టోక్స్, హెడ్ కోచ్ బ్రెండన్ మెక్ కల్లమ్.. బజ్ బాల్ ను పునః సమీక్షించే అవకాశాలు లేకపోలేదు.
బజ్ బాల్.. విఫలం కావడం ఇది రెండోసారి. గతంలో ఆస్ట్రేలియాపైనా చేతులెత్తేసింది ఇంగ్లాండ్. బజ్ బాల్.. థియరీ తొలుత ఆస్ట్రేలియాపై పని చేయలేదు. ఇప్పుడీ జాబితాలో భారత్ కూడా చేరింది. బజ్ బాల్ ను అమలు చేయడం మొదలు పెట్టిన తరువాత భారత్, ఆస్ట్రేలియాతో జరిగిన మూడు సిరీస్లలో ఒక్కటి కూడా గెలవలేదు.
ఈ రెండు జట్లపై ఇంగ్లాండ్.. ఆరు మ్యాచ్లల్లో విజయం సాధించింది. ఎనిమిదింట్లో ఓడిపోయింది. రెండు మ్యాచ్ లు డ్రాగా ముగిశాయి. 2023లో ఆస్ట్రేలియాతో జరిగిన యాషెస్ సిరీస్ను 2-2తో డ్రా చేసుకున్న తర్వాత.. స్వదేశంలో భారత్ తో జరిగిన సిరీస్ను 1-4తో కోల్పోయింది. ఈ రెండు మినహాయిస్తే- మిగిలిన జట్లపై ఇంగ్లాండ్ రాణించింది. 10 సిరీస్లలో 19 విజయాలను అందుకుంది.
ఈ ఏడాది నవంబర్ లో ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్ మొదలు కానుంది. నవంబర్ 21వ తేదీన పెర్త్ లో తొలి టెస్ట్. ఈ సిరీస్ నేపథ్యంలో బజ్ బాల్ థియరీని పునఃసమీక్షించాలని ఇంగ్లాండ్ జట్టు మేనేజ్మెంట్ ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియాపై ఈ కాన్సెప్ట్ విఫలం కావడం, భారత్ పై పని చేయకపోవడం వంటి పరిణామాల మధ్య దీనికి పుల్ స్టాప్ పెట్టాలనే ఆలోచనలో ఉంది.