
8 మందికి మాత్రమే:
భారత మహిళలు చివరిసారి 2014లో టెస్టు మ్యాచ్ ఆడారు. దక్షిణాఫ్రికాతో జరిగిన ఆ మ్యాచ్లో ఆడిన వారిలో మిథాలీ రాజ్ సహా ఏడుగురు ప్రస్తుత జట్టులో ఉన్నారు. భారత్ ఈ ఏకైక టెస్టు కోసం 18 మంది సభ్యులతో జట్టును ప్రకటించింది. ఇందులో 8 మందికి మాత్రమే గతంలో టెస్టు ఆడిన అనుభవం ఉండగా.. అందరూ ఆడిన మ్యాచ్లు కలిపి 30 మాత్రమే. వన్డే, టీ20 ఫార్మాట్ రెగ్యులర్ ప్లేయర్లు ఈ ఫార్మాట్లో అదే స్థాయి ఆటను ప్రదర్శించడం అంత సులువు కాదు. కనీసం దేశవాళీ క్రికెట్లో కూడా నాలుగు రోజుల మ్యాచ్లు ఆడలేదు. ఈ నేపథ్యంలో సీనియర్లే మ్యాచ్లో కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. పదేసి టెస్టుల అనుభవం ఉన్న కెప్టెన్ మిథాలీ రాజ్, పేసర్ జులన్ గోస్వామి జట్టును ముందుండి నడిపించాలి.

కంగారుపెడుతున్న పేసర్ల ఫిట్నెస్:
యువ సంచలనం షెఫాలీ వర్మ ఈ మ్యాచ్తో టెస్టు అరంగేట్రం చేయడం ఖాయం. స్మృతి మంధానతో కలిసి ఆమె ఇన్నింగ్స్ను ఆరంభించే అవకాశం ఉంది. టాప్ ఆర్డర్లో ఆమె చాలా ప్రభావం చూపనుంది. అలవాటు లేని పరిస్థితుల్లో అనుభవజ్ఞులైన త్రయం మిథాలీ రాజ్, హర్మన్ప్రీత్, పూనమ్ రౌత్ రాణించడం భారత్కు ఎంతో అవసరం. అయితే చివరగా టెస్టు మ్యాచ్ ఆడి చాలా ఏళ్లయిన నేపథ్యంలో వెటరన్ పేసర్లు జులన్ గోస్వామి, శిఖ పాండే సుదీర్ఘ స్పెల్స్ వేయగలుగుతారా అన్నది చూడాలి. జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, పూనమ్ రౌత్, పూనమ్ యాదవ్కు తమ సత్తా చాటేందుకు ఇది మంచి అవకాశం.

అనుభవజ్ఞులతో ఇంగ్లండ్:
15 మంది సభ్యుల ఇంగ్లండ్ టెస్టు జట్టులో 11 మందికి టెస్టులు ఆడిన అనుభవం ఉంది. అందరూ కలిసి 47 టెస్టు మ్యాచ్లు ఆడారు. ఇంగ్లండ్ జట్టు ఆడిన గత మూడు టెస్టుల్లో బరిలోకి దిగిన వారంతా ప్రస్తుత జట్టులో ఉన్నారు. కెప్టెన్ హీతర్ నైట్, నటాలీ స్కివర్, ఓపెనర్ బీమాంట్, ఆల్రౌండర్ బ్రంట్లకు అంతర్జాతీయ మహిళా క్రికెట్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. పేసర్లు ష్రబ్సోల్, కేట్ క్రాస్లతో పాటు లెఫ్టార్మ్ స్పిన్నర్ సోఫీ ఎకెల్స్టోన్ అత్యంత ప్రభావవంతమైన బౌలర్గా పేరు సంపాదించుకుంది. వీరందరికీ ఒంటి చేత్తో మ్యాచ్ను శాసించగల సామర్థ్యం ఉంది. సొంత మైదానంలో మ్యాచ్ జరుగుతుండటంతో పాటు ఫిట్నెస్ పరంగా కూడా వీరంతా భారత్ కంటే చాలా ముందంజలో ఉన్నారు.

హెడ్ టు హెడ్ రికార్డ్స్:
గత మూడు టెస్టుల్లో భారత్ హ్యాట్రిక్ విజయాలు సాధించింది. 2014లో ఇంగ్లండ్తో రెండు, దక్షిణాఫ్రికాపై ఓ మ్యాచ్లో గెలిచింది. ఇక ఈ మ్యాచ్లో గెలిస్తే వరుసగా అత్యధిక టెస్టు విజయాలు సాధించిన మహిళల జట్టుగా రికార్డు సొంతం చేసుకుంటుంది. ఇంగ్లండ్ గడ్డపై 8 టెస్టులు ఆడిన భారత్ రెండింట గెలిచింది. ఆరు మ్యాచ్లను డ్రా చేసుకొని అజేయ రికార్డుతో ఉంది. కాగా ఇంగ్లిష్ జట్టుతో మొత్తంగా 13 టెస్టుల్లో తలపడిన భారత్ రెండింట గెలిచి.. ఓ మ్యాచ్లో పరాజయం పాలైంది. 10 డ్రాగా ముగిశాయి.


Click it and Unblock the Notifications












