
హేమాహేమీల్లాంటి జట్లను ఓడించి..
ఈ సీజన్తోనే తన ఐపీఎల్ ప్రస్థానాన్ని ప్రారంభించిన గుజరాత్ టైటాన్స్.. ఫైనల్స్కు చేరింది. హార్దిక్ పాండ్యా సారథ్యాన్ని వహిస్తోన్న ఈ లోకల్ టీమ్తో- రాజస్థాన్ రాయల్స్ తలపడబోతోంది. ఐపీఎల్ తొలి సీజన్ ఛాంపియన్గా ఆవిర్భవించిన తరువాత మళ్లీ అలాంటి అవకాశాన్ని దక్కించుకుందీ పింక్ టీమ్. ఈ రెండు జట్లు కూడా లీగ్ దశలో తిరుగులేని విజయాలను అందుకున్నాయి. కొమ్ములు తిరిగిన జట్లను ఓడించాయి.

మాజీ ఛాంపియన్లపై..
ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, కోల్కత నైట్రైడర్స్.. వంటి మాజీ ఛాంపియన్లపై విజయఢంకా మోగించాయి. ముంబై ఇండియన్స్ అత్యంత దారుణంగా పెర్ఫార్మ్ చేసింది ఈ టోర్నమెంట్లో. ప్లేఆఫ్స్ కాదు కదా.. మ్యాచ్లను గెలవడానికే నానా తంటాలు పడింది. మొత్తం 14 మ్యాచ్లల్లో గెలిచింది నాలుగే. వరుసగా ఎనిమిది మ్యాచ్లను ప్రత్యర్థికి కోల్పోయింది. ఒక్క విజయం కోసం తొమ్మిది మ్యాచ్ల వరకు ఎదురు చూడాల్సిన దుస్థితిని ఎదుర్కొంది. పాయింట్ల పట్టికలో 10వ స్థానంలో తన ప్రస్థానాన్ని ముగించింది.

అయిదేళ్ల తరువాత ముంబై, చెన్నైలేని తొలి ఫైనల్
చెన్నై సూపర్ కింగ్స్ పరిస్థితి కూడా ఇంతే. 14 మ్యాచ్లల్లో గెలిచింది నాలుగే. పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచిందీ ధోనీసేన. ఈ రెండు మోస్ట్ సక్సెస్ఫుల్ జట్లు లేని మొట్టమొదటి ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ను మనం ఇవ్వాళ చూడబోతున్నాం. అయిదు సీజన్ల తరువాత తొలిసారిగా ఇలాంటి సన్నివేశం చోటు చేసుకుంది. అలాగే- చెన్నై, ముంబై కాకుండా మరో కొత్త జట్టు ఛాంపియన్గా ఆవిర్భవించబోతోండటం కూడా అయిదు సంవత్సరాల తరువాత ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

2016 మినహాయిస్తే..
2015వ సీజన్ ఫైనల్స్లో ముంబై ఇండియన్స్-చెన్నై సూపర్ కింగ్స్ తలపడ్డాయి. ఆ సీజన్లో ముంబై ఛాంపియన్గా నిలిచింది. 2016లో ఈ రెండు జట్లూ ఫైనల్స్కు చేరలేకపోయాయి. సన్రైజర్స్ హైదరాబాద్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆ సీజన్ ఫైనల్స్ ఆడాయి. సన్రైజర్స్ ఛాంపియన్గా నిలిచింది. 2017 సీజన్ నుంచి 2021 వరకూ ముంబై ఇండియన్స్ లేదా చెన్నై సూపర్ కింగ్స్లల్లో ఏదో ఒక జట్టు ఫైనల్స్ ఆడుతూ వచ్చింది.

ముంబై జర్నీ ఇలా..
2017లో ముంబై ఇండియన్స్-రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ మధ్య ఫైనల్ పోటీ ఏర్పడింది. ఇందులో ముంబై ఒక పరుగు తేడాతో విజయం సాధించింది. 2018 ఫైనల్లో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించి కప్ను ఎగరేసుకెళ్లింది చెన్నై సూపర్ కింగ్స్. 2019లో మళ్లీ ముంబై ఇండియన్స్-చెన్నై సూపర్ కింగ్స్ తలపడ్డాయి. ఇక్కడ కూడా ఒక్క పరుగు తేడాతో రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ ఛాంపియన్ అయింది.

యూఏఈలోనూ వాటిదే ఆధిపత్యం..
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా జరిగిన ఐపీఎల్ 2020 సీజన్ ఫైనల్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఫైనల్ చేరింది. టైటిల్ విన్నర్గా నిలిచింది. అయిదు వికెట్ల తేడాతో ఢిల్లీ కేపిటల్స్పై విజయఢంకా మోగించింది ముంబై. గత సంవత్సరం అదే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో జరిగిన ఫైనల్స్లో చెన్నై సూపర్ కింగ్స్ విజయకేతనాన్ని ఎగురవేసింది. కోల్కత నైట్రైడర్స్ను ఓడించింది ధోనీ సేన. నాలుగోసారి కప్ను గెలిచింది. ఈ సారి మాత్రం భిన్నంగా- ఈ రెండు జట్లు కూడా ఫైనల్స్లో అడుగు పెట్టలేదు. ఈ రెండూ లేని కొత్త జట్టును ఛాంపియన్గా ఈ రాత్రే మనం చూడబోతున్నాం.


Click it and Unblock the Notifications
