
ఇండియా తరఫున వన్డేల్లో 150వికెట్ల మైలురాయి చేరుకున్న సందర్భంగా మహమ్మద్ షమీ మాట్లాడుతూ..అత్యున్నత స్థాయిలో (ఇంటర్నేషనల్ లెవల్లో) స్థిరంగా విజయాన్ని రుచి చూడాలంటే మన ఆలోచనల్లో స్పష్టత ఉండాలని పేర్కొన్నాడు. భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ.. లైఫ్లో ఎన్నో గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నాడు. వాటన్నింటినీ ఎదుర్కొని టీమిండియా తరఫున అత్యుత్తమ బౌలర్లలో ఒకడిగా నిలిచిపోయాడు. ఇక మంగళవారం లండన్లోని కెన్నింగ్టన్ ఓవల్లో ఇంగ్లాండ్తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా తరఫున షమీ వన్డేల్లో తన 150వ వికెట్ను తీశాడు. క్రీజులో ఒంటి పోరాటం చేస్తున్న కెప్టెన్ జోస్ బట్లర్ (32 బంతుల్లో 30పరుగులు 6ఫోర్లు)ను ఔట్ చేసిన షమీ 150వ వికెట్ మైలురాయిని అందుకున్నాడు. నిఖార్సైన జోస్ బట్లర్ లాంటి ప్లేయర్ను ఔట్ చేసిన ఈ స్పీడ్స్టర్ ఈ ఘనత అందుకోవడం విశేషం. ఇక షమీ ఈ మ్యాచ్లో మూడు వికెట్లు తీశాడు. అతని దెబ్బకు బెన్ స్టోక్స్ డకౌట్ కాగా.. క్రెయిగ్ ఓవర్టన్ (8) క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
దాదాపు 10ఏళ్లకు పైగా టీమిండియా తరఫున అత్యుత్తమ ప్రదర్వన కనబరుస్తున్న ప్లేయర్ షమీ. అతను టీ20, వన్డే, టెస్టులకు భారత రెగ్యులర్ ప్లేయర్గా కొనసాగుతున్నాడు. ఇక సుదీర్ఘకాలంగా టీమిండియా తరఫున ఎలా ఆడగలుగుతున్నాడో కూడా అతను తన మనసు విప్పాడు. భారత బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రేతో ఈ విషయమై షమీ మాట్లాడుతూ.. భిన్న పరిస్థితులకు అనుగుణంగా తనను తాను మలుచుకోవడానికి బౌలర్కు పెద్ద మనసు ఉండాలని, అన్నింటినీ తట్టుకోగలగాలి. మీ మనస్సును అన్ని ఇతర వ్యాపకాల నుంచి క్లియర్ చేయడం అవసరం. మీరు ఏమి చేయాలి, ఎందుకోసం చేయాలి అనే దాని గురించి మీకు బాగా తెలిసి ఉండాలి. మీకు అన్నింటినీ పెద్ద హృదయంతో మన్నించే, సహించే లక్షణం ఉంటే.. మీరు ఏ ఫార్మాట్లోనైనా అడ్జస్ట్ అవుతారు.' అని షమీ బీసీసీఐ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లో అప్లోడ్ చేసిన వీడియోలో పేర్కొన్నాడు. షమీ ఇక తొలి వన్డేలో 29డాట్ బాల్స్తో (7-0-31-3) ప్రదర్శనతో ఆకట్టుకునే బౌలింగ్ చేశాడు. ఇక ఈ మ్యాచ్లో భారత్ 10 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ను ఓడించింది. జూలై 14 (గురువారం) మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా రెండో వన్డే జరగబోతుంది. ఇప్పటికే 1-0తేడాతో టీమిండియా సిరీస్లో ఆధిక్యంలో ఉంది.