క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి, పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ కలిసి ఒకే జట్టు తరఫున బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాదు, చిరకాల ప్రత్యర్థులైన పాక్ ఆటగాళ్లతో కలిసి భారత ఆటగాళ్లు పోరాడే సమయానికి వేళైనట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏ టోర్నీలో? ఎప్పుడంటే?
ఆఫ్రో-ఆసియా కప్ టోర్నీలో భారత్-పాక్ ఆటగాళ్లు కలిసి ఆడే అవకాశాలు ఉన్నాయి. దీని గురించి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు .కానీ ఆఫ్రికన్ క్రికెట్ అసోషియేషన్ ఛైర్మన్ సుమోద్ దామోదర్ ఈ టోర్నీ పున:ఫ్రారంభించడానికి ప్రయత్నాలు తీవ్రంగా చేస్తున్నాడు. ఐసీసీ ఛైర్మన్గా జై షా బాధ్యతలు అందుకోవడంతో ఈ టోర్నీ తిరిగి ఆరంభమవ్వడం ఖాయంగా అనిపిస్తోంది.

ఏంటీ ఆఫ్రో-ఆసియా కప్?
2005లో తొలిసారి ఆఫ్రో-ఆసియా కప్ నిర్వహించారు. ఈ టోర్నీలో ఆఫ్రికా XI వర్సెస్ ఆసియా XI పోటీపడతారు. మొదటిసారి నిర్వహించిన పోటీలో వీరేంద్ర సెహ్వాగ్, ఇంజుమామ్ వుల్ హక్ వంటి దిగ్గజాలు కలిసి ఆడారు. ఇక 2007లో జరిగిన రెండో ఎడిషన్లో గంగూలీ, ధోనీ సత్తాచాటారు. అయితే రెండో ఎడిషనే చివరి ఎడిషన్గా మారింది. ఆ తర్వాత ఈ టోర్నీని నిర్వహించలేదు. ఇప్పుడు 17 ఏళ్ల తర్వాత ఈ టోర్నీ తిరిగి ప్రారంభించాలని చూస్తున్నారు. టీ20 ఫార్మాట్లో నిర్వహించాలని ప్రయత్నిస్తున్నారు.
ఎవరెవరు పాల్గొంటారు?
ఆఫ్రో-ఆసియా కప్లో ఆసియా దేశాలు ఒక జట్టుగా, ఆఫ్రికన్ దేశాలు మరో జట్టుగా కలిసి పోటీపడతాయి. ఆసియా XIలో భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ వంటి దేశాల ఆటగాళ్లు ఉంటారు. ఇక ఆఫ్రికా XIలో సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా, కెన్యా వంటి దేశాల ప్లేయర్లు ఉంటారు.
అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఆసియా XI జట్టు ముందు ఆఫ్రికా XI జట్టు నిలవలేదు. ఆసియా XIలో బలమైన ఆటగాళ్లు ఉంటారు. ఇక ఆఫ్రికా XI కేవలం దక్షిణాఫ్రికా ఆటగాళ్ల మీదే ఆధారపడి ఉంటుంది. ఈ టోర్నీ జరిగితే మ్యాచ్లన్నీ ఏకపక్షంగా మారడం దాదాపు ఖాయమే. అయితే ఎప్పుడూ శత్రువుల్లా మైదానంలో తలపడే భారత్-పాక్ ఆటగాళ్లు కలిసి ఒకే జట్టు తరఫున పోరాడం అభిమానులకు కిక్క్ ఎక్కిచ్చే అంశం.