న్యూఢిల్లీ: బాల్ ట్యాంపరింగ్ కు పాల్పడినందుకు పాకిస్తాన్ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిదీ క్షమాపణలు చెప్పారు. భవిష్యత్తులో ఇటువంటి తప్పు చేయనని ఆయన అన్నారు. పెర్త్ లో తుది వన్డే మ్యాచులో బంతి తీరును ఉద్దేశ్యపూర్వకంగా మార్చినందుకు ఆఫ్రిదీపై రెండు మ్యాచుల నిషేధాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) విధించింది. అందుకు తాను సిగ్గుపడుతున్నానని, తాను అలా చేయాల్సి ఉండింది కాదని, ఆ క్షణంలోని ఉద్వేగంలో అలా చేశానని, దానికి క్షమాపణ చెబుతున్నానని ఆయన అన్నారు. అది క్లోజ్ మ్యాచ్ అని, అప్పటికి పాకిస్తాన్ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదని, తమకు విజయం అవసరంగా మారిందని, ఫాస్ట్ బౌలర్లకు సాయపడడానికి తాను అలా చేశానని, తనపై నిషేధం విధించారని, తద్వారా తనకు గుణపాఠం లభించిందని, భవిష్యత్తులో ఇలాంటి పని చేయనని ఆయన అన్నారు. మొహ్మద్ యూసుఫ్ స్థానంలో ఆస్ట్రేలియాపై జరిగిన పెర్త్ మ్యాచులో ఆఫ్రిదీ పాకిస్తాన్ జట్టుకు నాయకత్వం వహించాడు. ఆఫ్రిదీ బంతిని కొరుకుతూ దాని ఆకారాన్ని మార్చిన దృశ్యం కెమెరాల్లో చిక్కుకుంది.