అఫ్గానిస్థాన్కు అండగా నిలిచే బీసీసీఐపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సాయం అంటే ఉపయోగపడేలా చేయాలని ఘూటు వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అసలేం జరిగిందంటే.. హోమ్ గ్రౌండ్ లేని అఫ్గానిస్థాన్కు బీసీసీఐ నొయిడాలోని స్టేడియాన్ని ఇచ్చింది. దీని వేదికగా న్యూజిలాండ్తో అఫ్గాన్ ఏకైక టెస్టు ఆడుతోంది.
షెడ్యూల్ ప్రకారం సోమవారం ఈ మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ నిన్న కనీసం టాస్ కూడా పడలేదు. దీనికి కారణం వరుణుడు కూడా కాదు. సోమవారం అక్కడ వర్షమే పడలేదు. తడి ఔట్ ఫీల్డ్ కారణంగా తొలి రోజు ఆట రద్దయింది. అంతకుముందు చేరిన వర్షపునీటిని మైదాన సిబ్బంది తొలగించలేకపోయారు. పేలవమైన డ్రైనేజి వ్యవస్థ ఓ రోజు ఆటకు అడ్డంకిగా మారింది.

ఒక్క బంతిని అయినా వేయించాలని సాయంత్రం 4.15 గంటల వరకు అంపైర్లు ఎదురుచూశారు. కానీ అది సాధ్యం కాలేదు. అంతేకాదు, రెండో రోజు ఆట కూడా ఇంకా ప్రారంభంకాలేదు. టాస్ వేయడానికి కూడా మైదానం సిద్ధంగా లేదు. మధ్యాహ్నం 12 గంటలకు గ్రౌండ్ను పరీక్షించి అంపైర్లు నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో అఫ్గానిస్థాన్ అభిమానులు బీసీసీఐపై విమర్శలు చేస్తున్నారు.
2017లో స్టేడియంపై నిషేధం
నొయిడా స్టేడియాన్ని బీసీసీఐ 2017లో నిషేధం విధించింది. ఆ తర్వాత నుంచి బీసీసీఐ అనుబంధిత టోర్నమెంట్లు ఏదీ అక్కడ జరగలేదు. ఈ స్టేడియం ఏ రాష్ట్ర క్రికెట్ అసోషియేషన్ చేత నిర్వహించట్లేదు. గ్రేటర్ నొయిడా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ నిర్వహిస్తోంది. ఈ స్టేడియానికి కనీస మౌళిక సదుపాయాలు, సిబ్బంది కూడా లేదు. ఇక డ్రైనేజ్ వ్యవస్థ దారుణంగా ఉంటుంది.