అఫ్గానిస్థాన్ అభిమానుల ఆశలకు వరుణుడు మరోసారి నీళ్లు చల్లాడు. నొయిడా వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న ఏకైక టెస్టు నాలుగో రోజు ఆట కూడా రద్దయింది. కనీసం టాస్ కూడా వేసే పరిస్థితి కనిపించట్లేదు. రేపు కూడా ఆట జరగడం అనుమానమే అనిపిస్తోంది. మైదానంలోని ప్రతికూల పరిస్థితులతో మొదటి రెండు రోజులు ఆట కొనసాగని విషయం తెలిసిందే.
ఇక మూడో రోజు వర్షం కారణంగా రద్దు అయ్యింది. మంగళవారం రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురవడంతో నిన్నటి ఆటకు అంతరాయం కలిగింది. అయితే గురువారం కూడా వాన కష్టాలు కొనసాగాయి. ఉదయం నుంచి వర్షం పడుతుండటంతో మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచారు. ఇవాళ ఆటను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.

శుక్రవారం కూడా ఆట రద్దయ్యే పరిస్థితి ఉందని అఫిషియల్ బ్రాడ్కాస్టర్ ఆండ్రూ లియోనార్డ్ అన్నారు. ''వర్షం కారణంగా ఈ రోజు ఆట పూర్తిగా రద్దయింది. ఇక రేపు తిరిగొస్తాం. అయితే వాస్తవానికి రేపు కూడా ఆట జరిగే అవకాశం లేదు. రేపు ఉదయం చాలా త్వరగా మ్యాచ్ను వదిలేయడం తప్ప మరో మార్గం లేదనిపిస్తోంది. 2500 టెస్టుల సుదీర్ఘ చరిత్రలో బంతి పడకుండా మ్యాచ్ రద్దయిన ఎనిమిదో మ్యాచ్గా ఇది చరిత్రలో నిలుస్తుందని భావిస్తున్నా. వారం రోజులుగా ఇక్కడ 12 సెంటీమీటర్ల వర్షం కురుస్తోంది'' అని లియోనార్డ్ పేర్కొన్నారు.
టెస్టు ఫార్మాట్ ఆడే అవకాశాలను తక్కువగా పొందుతున్న అఫ్గానిస్థాన్కు ఇది చేదు వార్తే. న్యూజిలాండ్ వంటి బలమైన ప్రత్యర్థిని తమ జట్టును ఎదుర్కొనే తీరును చూడాలనుకున్న అఫ్గాన్ అభిమానులకు వరుణుడు వరుసగా షాక్లు ఇస్తున్నాడు. మరోవైపు న్యూజిలాండ్కు నిరాశలో ఉంది. అఫ్గానిస్థాన్ మ్యాచ్తో ఉపఖండ్ పిచ్లపై మరింత అనుభవం పెంచుకోవాలనుకున్న కివీస్కు చుక్కెదురైంది.
శ్రీలంక పర్యటనలో సెప్టెంబర్ 18 నుంచి న్యూజిలాండ్ రెండు టెస్టులు ఆడనుంది. ఆ తర్వాత భారత్ పర్యటనలో అక్టోబర్ 16 నుంచి మూడు టెస్టుల సిరీస్ ఆడనుంది. కాగా, మైదానంలో సరైన వసతులు లేకపోవడంతో తీవ్ర విమర్శలకు ఎదుర్కొన్న బీసీసీఐ.. నొయిడా మైదానానికి న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం నుంచి అదనపు కవర్లు తెప్పించింది. ఈ కవర్లతోనే దాదాపుగా మైదానం మొత్తాన్ని కప్పారు.