
హైదరాబాద్: ఆప్ఘన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ మాయ చేశాడు. బంగ్లాదేశ్తో జరిగిన టీ20 సిరిస్లో వరుసగా రెండో మ్యాచ్లో విజయం సాధించింది. దీంతో మూడు టీ20 సిరీస్లో మరో టీ20 మిగిలుండగానే 2-0తో కైవసం చేసుకుంది. మంగళవారం జరిగిన రెండో టీ20లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
రషీద్ ఖాన్ (4-0-12-4) స్పిన్ మాయాజాలానికి తోడు మహమ్మద్ నబీ (2/19; 15 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 31 నాటౌట్) రాణించడంతో బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 134 పరుగులు మాత్రమే చేయగలిగింది. బంగ్లా జట్టులో తమీమ్ ఇక్బాల్ (43) టాప్ స్కోరర్గా నిలిచాడు.
అనంతరం 135 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆప్ఘనిస్థాన్ 18.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆప్ఘన్ బ్యాట్స్మన్ సమియుల్లా షెన్వారి (49) రాణించాడు. మ్యాచ్ నువ్వానేనా అన్నట్టుగా సాగుతున్న సమయంలో మహ్మద్ నబి (31 నాటౌట్) చెలరేగడంతో మరో 7 బంతులు ఉండగానే లక్ష్యాన్ని చేధించింది.
ఈ మ్యాచ్లో అద్భుత ప్రదర్శన చేసిన రషీద్ ఖాన్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్న తర్వాత రషీద్ ఖాన్ మాట్లాడుతూ 'జట్టు సమిష్టి కృషితోనే ఇది సాధ్యమైంది. అన్ని విభాగాల్లో అద్భుత ప్రదర్శన కనబర్చింది' అని అన్నాడు.
'సరైన ప్రదేశంలో బంతులు వేసేందుకు సిద్ధంగా ఉన్నా. చక్కటి లెంథ్తో బంతులు సంధించా. షకీబ్, తమీమ్, మొసాద్దాయిక్, సౌమ్య సర్కార్ల వికెట్లు ఎంతో కీలకం. అందుకే వారిపై పూర్తిగా దృష్టి సారించా. ఎట్టకేలకు వారిని పెవిలియన్కు చేర్చా' అని రషీద్ ఖాన్ తెలిపాడు. ఇరు జట్ల మధ్య మూడో టీ20 గురువారం జరగనుంది.