
మెల్బౌర్న్: అంతర్జాతీయ క్రికెట్లో ఈ ఏడాది సంచలనం సృష్టించిన రషీద్ ఖాన్కు తీవ్రమైన లోటు సంభవించింది. ఈ లెగ్ స్పిన్నర్ తండ్రి మృతి పట్ల సంతాపాన్ని ప్రకటిస్తూ.. రషీద్కు ఆయన కుటుంబానికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని రషీద్ సహచరుడు, అఫ్గాన్ ఆల్ రౌండర్ మొహమ్మద్ నబీ వెల్లడించాడు. ప్రస్తుతం బిగ్ బాష్ లీగ్లో ఆడుతున్న రషీద్.. తన తండ్రి మరణవార్త తెలుసుకుని అఫ్గానిస్థాన్కు వెళ్లిపోయాడు.
తన కన్నతండ్రి మరణం పట్ల తీవ్ర విషాదానికి లోనైన రషీద్.. బాధాతప్త హృదయంతో ట్వీట్ చేశాడు. 'ఈ రోజు తీవ్రమైన విషాదానికి గురి అయ్యాను. నా జీవితంలో అత్యంత విలువైన వ్యక్తిని కోల్పోయాను. ఓ వెలుగును కోల్పోయినట్లు ఉంది. మనం దేవుడి దగ్గర నుంచే వచ్చాం. తిరిగి అక్కడికే వెళ్తాం. నువ్వు ప్రతీసారి చెప్పినట్లు బలంగా ఉండేందుకు ప్రయత్నిస్తా. నీ లోటును తీర్చుకోవడానికి నాకింకా స్థైర్యం కావాలి. నిన్నెప్పుడూ నా ప్రార్థనలో గుర్తుంచుకుంటూనే ఉంటాను.'
'ఈ విషయాన్ని వెల్లడించేందుకు చాలా బాధగా ఉంది. అఫ్గానిస్థాన్ జాతీయ క్రికెటర్, నా మిత్రుడు రషీద్ ఖాన్ తండ్రి చనిపోయారు. ఆయన మృతిపట్ల నా సంతాపం. రషీద్ కుటుంబసభ్యులకు ప్రగాడ సానుభూతి తెలియజేస్తున్నానంటూ' అఫ్గాన్ క్రికెటర్ మొహమ్మద్ నబీ ట్వీట్ చేశాడు. క్రికెటర్ రషీద్ తండ్రి మృతిపట్ల పలువురు క్రికెటర్లు, అతడి అభిమానులు సంతాపం తెలుపుతున్నారు. రషీద్కు అల్లాహ్ ధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ ట్వీట్లు చేస్తున్నారు.
రషీద్ అంతర్జాతీయ క్రికెట్లో స్పిన్నర్గా అరంగ్రేటం చేశాడు. కేవలం ఒకే ఒక్క టెస్టు ఆడి, 52 వన్డేలు ముగించాడు. ఇందులో 35 అంతర్జాతీయ టీ20లు కూడా ఉన్నాయి.
దీని కంటే ముందు శనివారం క్రికెట్ రంగంలో మరో చేదు వార్త చోటు చేసుకుంది. ఇంగ్లాండ్ డైరక్టర్ ఆఫ్ క్రికెట్ పదవి బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆండ్రూ స్ట్రాస్ భార్య మృతి చెందారు. ఈ విషయాన్ని అతని కుటుంబమే అధికారికంగా ప్రకటించింది. రూత్ స్ట్రాస్ (46) ఊపిరితిత్తుల క్యాన్సర్తో బాధపడుతున్నట్లు కుటుంబమే అధికారికంగా ప్రకటించింది.