
హైదరాబాద్: భారత జట్టులో కంటే అఫ్గానిస్థాన్ జట్టులోనే మెరుగైన స్పిన్నర్లున్నారని ఆ జట్టు కెప్టెన్ అస్గర్ అభిప్రాయపడ్డాడు. రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజాల కంటే మెరుగైన బౌలర్లున్నారని విశ్వాసం వ్యక్తం చేస్తున్నాడు. గడిచిన ఐపీఎల్ 2018వ సీజన్లో తమ దేశ ఆటగాళ్లు రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రెహమాన్ ప్రదర్శనే దానికి నిదర్శనమని పేర్కొన్నాడు.
బెంగళూరు వేదికగా గురువారం నుంచి భారత్తో ఏకైక టెస్టు మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో.. మీడియాతో అఫ్గానిస్థాన్ కెప్టెన్ తమ ప్లేయర్ల గురించి మాట్లాడాడు. స్పిన్నర్లు మహ్మద్ నబీ, రషీద్ ఖాన్ని ఆదర్శంగా తీసుకుని దేశంలో చాలా మంది స్పిన్నర్లు వెలుగులోకి వస్తున్నారని అస్గర్ వివరించాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2018 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున అత్యుత్తమంగా రాణించిన రషీద్ ఖాన్.. గత వారం బంగ్లాదేశ్తో ముగిసిన మూడు టీ20ల సిరీస్లోనూ ఏకంగా 12 వికెట్లు పడగొట్టి ఒంటిచేత్తో అఫ్గానిస్థాన్ జట్టుని గెలిపించిన విషయం తెలిసిందే.
'అఫ్గానిస్థాన్ జట్టులో మంచి స్పిన్నర్లున్నారని ప్రపంచమంతా తెలుసు. రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రెహ్మన్, మొహమ్మద్ నబీ, రెహ్మత్, జహీర్ ఖాన్ గత కొంతకాలంగా మెరుగ్గా రాణిస్తున్నారు. వీరిని చూసి దేశంలో చాలా మంది యువ క్రికెటర్లు స్పిన్ బౌలింగ్ని కెరీర్గా ఎంచుకుంటున్నారు. అఫ్గానిస్థాన్ జట్టు స్పిన్ విభాగం ప్రస్తుతం చాలా బలంగా కనిపిస్తోంది. ఇంకా చెప్పాలంటే.. భారత జట్టులో కంటే మా జట్టులోనే మెరుగైన స్పిన్నర్లున్నారు' అని అస్గర్ అభిప్రాయపడ్డాడు.
ఇటీవల టెస్టు హోదా దక్కించుకున్న అఫ్గానిస్థాన్ జట్టు భారత్తోనే మొదటి టెస్టు ఆడబోతోంది. ఈ మ్యాచ్కు మెడ గాయం కారణంగా కెప్టెన్ కోహ్లీ అందుబాటులో ఉండకపోవడంతో.. రహానె కెప్టెన్ బాధ్యతలు చేపట్టనున్నాడు. వాతావరణ నిపుణుల అంచనా ప్రకారం.. మ్యాచ్ జరిగే రోజుల్లో వర్షం పడే సూచనలున్నాయట.