హైదరాబాద్: ఇంగ్లాండ్తో మ్యాచ్కి ముందు ఆప్ఘనిస్థాన్ జట్టు ప్లేయర్లు మాంచెస్టర్లోని ఓ రెస్టారెంట్లో ఘర్షణకు దిగారా? అంటే అవుననే అంటున్నారు మాంచెస్టర్ పోలీసులు. ప్రపంచకప్లో భాగంగా మంగళవారం ఇంగ్లాండ్-ఆప్ఘనిస్థాన్ జట్లు తలపడిన సంగతి తెలిసిందే.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ఈ మ్యాచ్కి ముందు ఆప్ఘనిస్థాన్ జట్టు మాంచెస్టర్లోని లివర్పూల్ రోడ్డులో ఉన్న అక్బర్ రెస్టారెంట్కు వెళ్లారు. అయితే, రెస్టారెంట్లో పలువురు యువకులు ఆప్ఘన్ క్రికెటర్ల వీడియోని తీసేందుకు ప్రయత్నించగా వారు వద్దని వారించారు. ఈ క్రమంలో చిన్నపాటి ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది.
దీంతో ఆప్ఘన్ జట్టులోని ఆటగాడు ఒకరు ఘర్షణకు దిగినట్లు వార్తలు రావడంతో గ్రేటర్ మాంచెస్టర్ సిటీ పోలీసులు రాత్రి 11.15 గంటలకు రెస్టారెంట్కు వెళ్లారు. అయితే, ఈ ఘర్షణలో అతడు గానీ, మరెవరూ గాయపడలేదని పోలీసులు వెల్లడించారు. దీనిపై విచారణ కొనసాగుతుందని తెలిపారు.
ఇదే విషయమై ఇంగ్లాండ్ మ్యాచ్ అనంతరం ఆప్ఘన్ కెప్టెన్ గుల్బదిన్ నైబ్ను విలేకరులు ప్రశ్నించగా ఈ విషయంపై తనవద్ద సమాచారం లేదని చెప్పాడు. "నాకు తెలియదు. దీని గురించి తెలుసుకోవాలంటే మా సెక్యూరిటీ ఆఫీసర్ను అడగండి. నాకు గానీ, జట్టుకు కానీ ఇదేమంత పెద్ద సమస్య కాదు" అని అన్నాడు.
ఇదిలా ఉంటే, ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో ఆప్ఘన్ 150 పరుగుల తేడాతో ఘోరంగా ఓడిపోయింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 397 పరుగులు చేసింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 398 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గాన్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 247 పరుగులకే పరిమితమైంది.
ఆప్ఘనిస్థాన్ ఆటగాళ్లలో హష్మతుల్లా(74), రహ్మత్(46), అఫ్గాన్(44) మినహా ఎవరూ అంతగా రాణించలేదు. ఇంగ్లాండ్ బౌలర్లలో ఆర్చర్, రషీద్ తలో మూడు వికెట్లు తీయగా.. మార్క్ వుడ్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్లో ఆప్ఘనిస్థాన్ బౌలర్లను ఊచకోత కోసిన ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.