హైదరాబాద్: యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్లో స్పాట్ ఫిక్సింగ్ కలకలం రేగింది. ఆప్ఘన్ వికెట్ కీపర్ మొహ్మద్ షహ్జాద్ను స్పాట్ ఫిక్సింగ్ చేయమని కొంతమంది బుకీలు కలిసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని షహ్జాద్ నేరుగా జట్టు మేనేజ్మెంట్కు తెలియజేయడంతో ఐసీసీ యాంటీ కరెప్షన్ యూనిట్ రంగంలోకి దిగింది.
కోచ్ ఎప్పుడూ కెప్టెన్ వెనుక స్థానంలో ఉండాలి: గంగూలీ
అక్టోబర్ నెలలో షార్జా వేదికగా జరిగే అప్ఘన్ ప్రీమియర్ లీగ్లో ఫిక్సింగ్ చేయాలంటూ తనను కొంతమంది కలిసినట్లు షహ్జాద్ ఈ సందర్భంగా వెల్లడించాడు. దీనిపై అలెక్స్ మార్షల్ నేతృత్వంలోని ఐసీసీ యాంటీ కరెప్షన్ యూనిట్ ఇప్పటికే దర్యాప్తు చేపట్టింది. దీనిపై అలెక్స్ మార్షల్ మీడియాతో మాట్లాడారు.
"షహ్జాద్ను ఫిక్పింగ్కు పాల్పడమని కొంతమంది కలిశారు. అది కూడా ఆప్ఘన్ టీ20 లీగ్లో ఫిక్సింగ్ చేయాలంటూ బుకీలు అతడిని ప్రేరేపించారు. కాగా, దీనిని టీమ్ మేనేజ్మెంట్ ద్వారా మా దృష్టికి తీసుకొచ్చారు. దర్యాప్తు చేపట్టాం. గత 12 నెలల్లో ఐదుగురు అంతర్జాతీయ స్థాయి కెప్టెన్లను బుకీలు కలిశారు" అని అలెక్స్ వెల్లడించాడు.
"ఇందులో పూర్తిస్థాయి సభ్యత్వం కలిగిన నాలుగు దేశాలకు చెందిన కెప్టెన్లు ఉన్నారు. గతేడాది నుంచి 32 మంది ఆటగాళ్లను స్పాట్ ఫిక్సింగ్ కేసులో విచారించాం. అందులో ఎనిమిది మందిపై వేటు పడింది" అని మార్షల్ పేర్కొన్నాడు.