కాబుల్: వెస్టిండీస్ గడ్డపై ప్రతి ఏడాది జరుగుతున్న కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) పూర్తి షెడ్యూల్ ఇటీవలే విడుదలైంది. ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 10 వరకు సీపీఎల్ జరగనుందని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. కరోనా వైరస్ నేపథ్యంలో బయో సెక్యూర్ వాతావరణంలో ప్రేక్షకులు లేకుండా ట్రినిడాడ్, టొబాగోలో ఈ సీజన్ జరుగనుంది. వైరస్ వ్యాప్తి అనంతరం జరగనున్న ప్రైవేట్ లీగ్ ఇదే కావడం విశేషం. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 సీజన్ ప్రారంభానికి 9 రోజుల ముందుగానే సీపీఎల్ ముగియనుంది.
సీపీఎల్ 2020 ఆడడానికి ఎందరో ఆటగాళ్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.. పలు దేశాల లాక్డౌన్ నిబంధనలు లీగ్లో ఆడకుండా చేస్తున్నాయి. ఇప్పటికే దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ క్రికెటర్లు దూరమవుతున్నట్లు వార్తలు రాగా.. తాజాగా ఆఫ్ఘనిస్తాన్ అంతర్జాతీయ క్రీడాకారులు ఖైస్ అహ్మద్, రహమనుల్లా గుర్బాజ్, నూర్ అహ్మద్ కూడా దూరమవనున్నారని తెలుస్తోంది. లండన్ నుండి కరేబియన్కు వెళ్లనున్న సీపీఎల్ ప్రత్యేక చార్టర్డ్ విమానాలలో ఎక్కడానికి అవసరమైన యూకే ట్రాన్సిట్ వీసాలు లేనందున ముగ్గురు ఆటగాళ్లు టోర్నీలో ఆడే అవకాశం లేదట.
లీగ్లో పాల్గొననున్న ఆటగాళ్లు 14 రోజుల క్వారంటైన్లో ఉండడానికి ఆగస్టు 1న ట్రినిడాడ్లో ఉండాల్సి ఉంది. అయితే ఇప్పటికి కూడా ఖైస్ అహ్మద్, రహమనుల్లా గుర్బాజ్, నూర్ అహ్మద్ అక్కడికి చేరుకోలేదు. 'ముగ్గురు ఆటగాళ్లు టోర్నమెంట్లో పాల్గొనలేకపోవడం అవమానంగా ఉంది. కానీ ఈ సంవత్సరం సురక్షితమైన ప్రయాణం కల్పించడం చాలా కష్టమైంది. వైరస్ కారణంగా ట్రినిడాడ్, టొబాగో సరిహద్దులు మూసివేయబడ్డాయి. సీపీఎల్ 2020 కోసం ప్రత్యేక చార్టర్ విమానాలు నడపడానికి కొన్ని తేదీలు మాత్రమే ఇచ్చారు. అందుకే మాకు ఎక్కువ సమయం దొరకలేదు. సీపీఎల్ ప్రతినిధి ఒకరు క్రిక్బజ్తో అన్నారు.
ఇక సీపీఎల్ 2020లో ఆడేందుకు ఒకే ఒక్క దక్షిణాఫ్రికా క్రికెటర్ వెస్టిండీస్ గడ్డపైకి వెళ్లనున్నాడు. అతడు మరెవరో కాదు దక్షిణాఫ్రికా మాజీ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా దక్షిణాఫ్రికాలో ప్రయాణ ఆంక్షల్ని ఆ దేశ ప్రభుత్వం ఇంకా కొనసాగిస్తుంది. ఆగస్టు తొలి వారం నాటికి సీపీఎల్లో ఆడనున్న దక్షిణాఫ్రికా క్రికెటర్లు విండీస్ గడ్డపై చేరుకోవడం కష్టంగా మారింది. అయితే దక్షిణాఫ్రికా జట్టుకి ఆడుతున్న పాకిస్థాన్ సంతతి క్రికెటర్ ఇమ్రాన్ తాహిర్ మాత్రం సీపీఎల్ 2020 సీజన్లో ఆడబోతున్నట్లు ప్రకటించాడు. దానికి కారణం తాహిర్ ప్రస్తుతం పాక్లో ఉండటమే. పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో ఆడేందుకు ఈ ఏడాది ఆరంభంలో పాకిస్థాన్ వెళ్లిన తాహిర్.. వైరస్ నేపథ్యంలో లాక్డౌన్ విధించడంతో అక్కడే ఉండిపోయాడు.
కోహ్లీ ఎప్పుడూ వాటి గురించే అడుగుతాడు: పుజారా