గతేడాది జరిగిన వన్డే వరల్డ్ కప్ నుంచి అఫ్గానిస్థాన్ జట్టు అద్భుత ప్రదర్శన చేస్తుంది. వన్డే ప్రపంచకప్-2023లో ఇంగ్లండ్, పాకిస్థాన్ జట్లను మట్టికరిపించింది. ఇక ఈ ఏడాది జరిగిన టీ20 వరల్డ్ కప్లో సంచలనాలు నమోదు చేసింది. బలమైన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ను ఓడించి సెమీఫైనల్స్కు అర్హత సాధించింది. తాజాగా దక్షిణాఫ్రికాపై వన్డే సిరీస్ను నెగ్గింది.
ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు వన్డేల సిరీస్ను అఫ్గాన్ 2-1తో కైవసం చేసుంది. సౌతాఫ్రికాపై తొలిసారి ద్వైపాక్షిక సిరీస్ గెలిచింది. ఈ విజయంలో అఫ్గానిస్థాన్ కెప్టెన్ హస్మతుల్లా షాహిది కీలక పాత్ర పోషించాడు. జట్టులో ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ ముందుకు నడిపించి విజయాలు అందుకున్నాడు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హస్మతుల్లా కీలక వ్యాఖ్యలు చేశాడు.

'అఫ్గానిస్థాన్ జట్టులో తీసుకువచ్చే అవకాశం ఉంటే ఏ భారత క్రికెటర్ను ఎంపిక చేసుకుంటారు?' అని యాంకర్ అడిగిన ప్రశ్నకు హస్మతుల్లా షాహిది ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, ప్రపంచ అత్యుత్తమ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాలలో ఎవరిని ఎంచుకోకుండా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లిని సెలక్ట్ చేసుకున్నాడు. దానికి వివరణ కూడా ఇచ్చాడు.
''మా జట్టులో విరాట్ కోహ్లి ఉండాలని అనుకుంటున్నాను. అతని ప్రదర్శన, సాధించిన గణాంకాలను చూడండి.. అద్భుతంగా ఉంటాయి. కోహ్లి 50 వన్డే సెంచరీలు సాధించాడు. 50 సెంచరీలు అని చెప్పడం సులభమే, కానీ ఆ ఘనతను సాధించడం ఎంతో కష్టతరం. అతనే ఏంటో తాను సాధించిన గణాంకాలు, రికార్డులే చెబుతాయి. కోహ్లి మా జట్టులో ఉంటే ఎంతో ఆనందిస్తా'' అని హస్మతుల్లా షాహిది పేర్కొన్నాడు.
35 ఏళ్ల విరాట్ కోహ్లి భారత్ తరఫున 114 టెస్టులు, 295 వన్డేలు, 125 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 48.74 సగటుతో 8871 పరుగులు చేశాడు. 29 శతకాలు బాదాడు. ఇక వన్డే ఫార్మాట్లో 58.18 సగటుతో 13906 పరుగులు సాధించాడు. 50 వన్డే సెంచరీలు నమోదుచేశాడు. ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన టీ20 ఫార్మాట్లో కోహ్లి 48.7 సగటుతో 4188 పరుగులు చేశాడు. ఓ సెంచరీ బాదాడు.