Pakistan-Afghanistan War: పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల మధ్య సంబంధాలు ఏ మాత్రం సరిగా లేవు. రెండ్రోజుల పోరాటం తర్వాత కాల్పుల విరమణ జరిగింది. అయితే పాకిస్తాన్ ఈ కాల్పుల విరమణను ఉల్లంఘిస్తూ ఆఫ్ఘనిస్తాన్పై వైమానిక దాడులు చేసింది. ఈ దాడిలో ముగ్గురు ఆఫ్ఘన్ క్రికెటర్లు మరణించారు. అయితే ఈ ఆటగాళ్ల గురించి ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు(ACB) స్వయంగా పోస్ట్ ద్వారా సమాచారాన్ని అందించింది.
మరణించిన ఆ ముగ్గురు ఆఫ్ఘన్ క్రికెటర్లు ఎవరు?
పాకిస్తాన్ వైమానిక దాడుల్లో యువ క్రికెటర్లు కబీర్ ఆఘా, సిబ్గతుల్లా, హారూన్ మరణించారని ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. ఈ ముగ్గురూ ఆఫ్ఘనిస్తాన్ యువ క్రికెటర్లు కావడం గమనార్హం. స్నేహపూర్వక క్రికెట్ మ్యాచ్ ఆడేందుకు ఈ ఆటగాళ్లు మొదట పక్టికా ప్రావిన్స్ రాజధాని షార్నాకు వెళ్లారు. వారు ఉరుగున్ వద్ద తమ ఇంటికి తిరిగి వస్తుండగా.. ఓ సభ సమయంలో వారిని లక్ష్యంగా చేసుకుని దాడి జరిగింది. ఈ ముగ్గురు ఆటగాళ్లు దేశీయ క్రికెట్లో నిలకడగా ఆడుతున్నారు. జాతీయ జట్టులోకి రావడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ యువ ఆటగాళ్ల మరణంతో యావత్ క్రికెట్ ప్రపంచంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత తరుణంలో ఇది చాలా పెద్ద నష్టం.

దాడిలో మొత్తం 8 మంది మృతి
పాకిస్తాన్ వైమానిక దాడిలో మొత్తం 8 మంది మరణించారు. వీరిలో 5 మంది సామాన్య పౌరులు ఉన్నారు. అంతే కాకుండా 7గురు గాయపడ్డారు. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు ఈ ముగ్గురు ఆటగాళ్లను అమరులుగా ప్రకటించి వారి కుటుంబాలకు సంతాపం, సంఘీభావాన్ని తెలియజేసింది. తమ క్రికెటర్ల మరణం కారణంగా ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు(ఏసీబీ) పాకిస్తాన్లో జరగాల్సిన ట్రై-సిరీస్ నుంచి వైదొలిగింది. ఈ దాడి తర్వాత ఆఫ్ఘనిస్తాన్ కూడా గట్టి సమాధానం ఇవ్వవచ్చని భావిస్తున్నారు.