శ్రీలంక - అఫ్గానిస్థాన్ మధ్య జరిగిన ఆఖరి టీ20 వివాదాస్పదంగా ముగిసింది. అంపైర్ తప్పిదంతో మ్యాచ్ ఫలితం మారిందని శ్రీలంక టీ20 జట్టు కెప్టెన్ హసరంగ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. అంతేగాక అంపైర్పై ఘూటు విమర్శలు చేశాడు. అసలేం జరిగిదంటే.. బుధవారం ఉత్కంఠభరితంగా సాగిన మూడో టీ20లో అఫ్గానిస్థాన్ మూడు పరుగుల తేడాతో విజయం సాధించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లకు అయిదు వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసింది. ఓపెనర్లు గుర్బాజ్ (70; 43 బంతుల్లో), హజ్రతుల్లా (45; 22 బంతుల్లో) సత్తాచాటారు. అనంతరం ఛేదనలో లంక 20 ఓవర్లకు ఆరు వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసింది. నిస్సాంక (60; 30 బంతుల్లో), కామిందు మెండిస్ (65*; 39 బంతుల్లో) పోరాడారు.

అయితే శ్రీలంక విజయానికి ఆఖరి ఆరు బంతుల్లో 19 పరుగులు అవసరమయ్యాయి. వఫదర్ తొలి మూడు బంతుల్లో 8 పరుగులు ఇచ్చాడు. అయితే నాలుగో బంతిని హై ఫుల్టాస్ వేశాడు. మెండీస్ నడుమ కంటే ఎత్తులో స్పష్టంగా వెళ్లింది. కానీ అంపైర్ దాన్ని నో బాల్గా ప్రకటించలేదు. చివరి రెండు బంతులకు మెండీస్ ఆరు పరుగులే చేయడంతో లంక మూడు పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
నో బాల్ వివాదంపై లంక కెప్టెన్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గెలుచుకున్న హసరంగ స్పందిస్తూ.. ''అంతర్జాతీయ మ్యాచ్ల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవద్దు. నడుమ ఎత్తు వరకు వచ్చి, స్పష్టంగా నిర్ణయాలు వెల్లడించలేని పరిస్థితుల్లో ఇలాంటి నిర్ణయాలు వెల్లడిస్తే ఓ అర్థం ఉంటుంది. కానీ అది చాలా ఎత్తులో వచ్చింది. కాస్త ఎత్తులో వస్తే బ్యాటర్ తలకు బంతి కూడా తగిలేది. ఇది కూడా గమనించలేకపోతే అంతర్జాతీయ క్రికెట్లో అంపైరింగ్ చేయడం అనవసరం. వేరే పని ఏదైనా చూసుకుంటే మంచిది'' అని అన్నాడు.
''గతంలో ఇలాంటి నిర్ణయాలపై సమీక్ష కోరే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ఐసీసీ దాన్ని తొలగించింది. దీనిపై మా బ్యాటర్ రివ్యూను కోరడానికి ప్రయత్నించాడు. అయితే ఫ్రంట్ ఫుట్ నో బాల్ను తనిఖీ చేసినట్లుగానే థర్డ్ అంపైర్కు ఈ రకమైన నో బాల్స్ గురించి నిర్ణయించేలా బాధ్యతలు ఇవ్వాలి'' అని హసరంగ పేర్కొన్నాడు.