దక్షిణాఫ్రికాకు ఓదార్పు విజయం దక్కింది. షార్జా వేదికగా ఆదివారం జరిగిన ఆఖరి వన్డేలో అఫ్గానిస్థాన్పై ఏడు వికెట్ల తేడాతో నెగ్గింది. మూడు వన్డేల సిరీస్ను 1-2తో ముగించింది. తొలి రెండు వన్డేల్లో అఫ్గాన్ సంచలన ప్రదర్శనతో గెలిచిన సంగతి తెలిసిందే. తొలిసారి సౌతాఫ్రికాపై ద్వైపాక్షిక సిరీస్ నెగ్గింది. కానీ నామమాత్రపు ఆఖరి వన్డేలో పేలవ ప్రదర్శన చేసింది.
మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ 34 ఓవర్లలో 169 పరుగులకు ఆలౌటైంది. గుర్బాజ్ రహ్మనుల్లా (89; 94 బంతుల్లో, 7 ఫోర్లు, 4 సిక్సర్లు) మరోసారి జట్టుకు వెన్నెముకగా నిలిచాడు. సహచరులు విఫలమైనా నిలకడగా పరుగులు సాధించి స్కోరుబోర్డు ముందుకు నడిపించాడు. గజన్ఫర్ (31; 15 బంతుల్లో, 2 ఫోర్లు, 3 సిక్సర్లు) కీలక పరుగులు చేశాడు. వీరిద్దరితో కెప్టెన్ షాహిది (10; 17 బంతుల్లో, 1 ఫోర్) మాత్రమే రెండంకెల స్కోరు అందుకున్నాడు.

దక్షిణాఫ్రికా బౌలర్లలో ఎంగిడి, ఫెహ్లుక్వాయో, పీటర్ తలో రెండు వికెట్లు తీశారు. ఫార్టిన్ ఒక్క వికెట్ పడగొట్టాడు. సఫారీ బౌలర్ల ధాటికి టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అఫ్గాన్ ఆది నుంచే క్రమంగా వికెట్లు కోల్పోయింది. అయితే 133 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయిన జట్టుకు గజన్ఫర్ కాస్త పోరాడే స్కోరు అందించాడు. అనంతరం ఛేదనలో దక్షిణాఫ్రికా 33 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది.
మార్క్రమ్ (69 నాటౌట్; 67 బంతుల్లో, 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ అర్ధశతకంతో చెలరేగాడు. టోని డిజోర్జి (26; 31 బంతుల్లో, 2 ఫోర్లు, 1 సిక్సర్), ట్రిస్టన్ సబ్స్ (26 నాటౌట్; 42 బంతుల్లో, 1 ఫోర్, 1 సిక్సర్), బవుమా (22; 28 బంతుల్లో, 3 ఫోర్లు) పరుగులు చేశారు. మహ్మద్ నబీ, ఫరీద్, గజన్ఫర్ తలో వికెట్ తీశారు.