అఫ్గానిస్థాన్తో ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్లో బంగ్లాదేశ్ డక్వర్త్లూయిస్ పద్ధతిలో ఎనిమిది పరుగుల తేడాతో ఓటమిపాలైంది. సెమీఫైనల్స్కు వెళ్లే సువర్ణావకాశాన్ని చేజార్చుకుని టోర్నీ నుంచి నిష్క్రమించింది. సెమీస్కు వెళ్లే దారులు మూసుకుపోయినప్పటికీ ఓదార్పు విజయం కోసం బంగ్లాదేశ్ తీవ్రంగా ప్రయత్నించింది.
ఈ క్రమంలో పరోక్షంగా ఆస్ట్రేలియా సెమీస్ కోసం తీవ్రంగా పోరాడింది. కానీ విజయతీరాలకు చేరలేపోయింది. ఫలితంగా బంగ్లాదేశ్తో పాటు ఆసీస్ ప్రపంచకప్ నుంచి వైదొలిగింది. మొదట అఫ్గానిస్థాన్ 20 ఓవర్లలో అయిదు వికెట్లకు 115 పరుగులు చేసింది. గుర్బాజ్ (43; 55 బంతుల్లో, 3 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్. రిషద్ హొస్సేన్ (3/26) మూడు వికెట్లతో సత్తాచాటాడు.

అనంతరం ఛేదనలో బంగ్లాదేశ్ 17.5 ఓవర్లలో 105 పరుగులకు ఆలౌటైంది. రషీద్ ఖాన్ (4/23), నవీనుల్ హక్ (4/26) చెరో నాలుగు వికెట్లతో విజృంభించారు. లిటన్ దాస్ (54 నాటౌట్; 49 బంతుల్లో, 5 ఫోర్లు, 1 సిక్సర్) పోరాడాడు. కాగా, మ్యాచ్ అనంతరం ఓటమికి గల కారణాలు బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ షాంటో వివరించాడు. ప్లాన్-ఏతో పాటు ప్లాన్-బీ విఫలమవ్వడంతో తమ జట్టుతో పాటు ఆస్ట్రేలియా టోర్నీ నుంచి వైదొలగాల్సి వచ్చిందని తెలిపాడు.
''బంతితో మెరుగ్గా రాణించాం. కానీ బ్యాటింగ్ యూనిట్గా నిరాశపరిచాం. ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో తప్పు నిర్ణయాలు తీసుకున్నాం. ఇది ఓటమికి ప్రధాన కారణమైంది. మా ప్లాన్ ఏంటంటే.. తొలి ఆరు ఓవర్లలో దూకుడుగా ఆడాలి. ఈ క్రమంలో వికెట్లు కోల్పోతే సాధారణ ఆట తీరుతో మరో ప్లాన్ అమలు చేయాలి. కానీ అది జరగలేదు. మిడిల్ ఓవర్లలో మా ప్రణాళిక ఫలించలేదు''
''ఈ వరల్డ్ కప్ ఆద్యంతం మా ఫాస్ట్ బౌలర్లు, స్పిన్నర్లుగా గొప్పగా సత్తాచాటారు. రిషద్ అద్భుత ప్రదర్శన చేశాడు. ఫీల్డింగ్ పరంగా మేం సత్తాచాటాం. కానీ బ్యాటింగ్ విభాగంలో మెరుగవ్వాలి. మా టాప్ ఆర్డర్ నిరాశపరిచింది. వర్షం వల్ల మ్యాచ్ ఆలస్యమవ్వడం మా ఓటమికి కారణమని అనుకోవట్లేదు. అలా అయినా తడి బంతి మాకు కలిసొస్తుంది. మా బ్యాటింగ్ వైఫ్యలమే కొంపముంచింది'' అని షాంటో పేర్కొన్నాడు.