హైదరాబాద్: బీసీసీఐ పాలనా వ్యవహారాలు చూసేందుకు కొత్త సభ్యులను ఎంపిక చేసే బాధ్యతను చేపట్టడానికి ప్రముఖ సీనియర్ న్యాయవాది పాలీ ఎస్ నారిమన్ విముఖత వ్యక్తం చేశాడు. లోధా కమిటీ ఇచ్చిన సిఫారసులు అమలు చేయలేదనే కారణంతో బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, కార్యదర్శి అజయ్ షిర్కేలను తొలగిస్తూ సోమవారం సుప్రీం తీర్పులో పేర్కొంది.
తొలగించి వారి స్ధానంలో కొత్త సభ్యులను ఎన్నుకునే బాధ్యతలను ప్రభుత్వ న్యాయవాదులైన గోపాల్ సుబ్రహ్మణియమ్, ఫాలీ ఎస్ నారిమన్లకు సుప్రీం కోర్టు సూచించింది. అయితే తాను గతంలో బీసీసీఐ తరుపున న్యాయవాదిగా పనిచేసినందువల్ల బీసీసీఐ పాలనా వ్యవహారాల సభ్యుల ఎంపికలో భాగం కాలేనని నారిమన్ సుప్రీంకు తెలిపాడు.
బీసీసీఐ పాలనా వ్యవహారాలు చూసేందుకు కొత్త సభ్యులను ఎంపిక చేసేందుకు సుప్రీంకోర్టు నేడు ప్రముఖ న్యాయవాది ఎఫ్ఎస్ నారిమన్ స్థానంలో అనిల్ దివాన్ను నియమించింది. తాను గతంలో బీసీసీఐ తరఫు న్యాయవాదిగా పనిచేసినందున ఇప్పుడీ బాధ్యత చేపట్టలేనని నారిమన్ తెలపడంతో న్యాయస్థానం ఈ మార్పు చేసింది.

2009లో బీసీసీఐకి తాను న్యాయవాదిగా ఉన్నానని కాబట్టి పాలనా వ్యవహారాలకు సంబంధించి సభ్యులను ఎంపిక చేయలేనని టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనంకు ఆయన స్పష్టం చేశారు. దీంతో నారిమన్ విముఖత వ్యక్తం చేయడంతో అతని స్ధానంలో ప్రముఖ న్యాయవాది అనిల్ దివాన్ను అమికస్క్యూరీగా నియమిస్తున్నట్లు ప్రకటించింది.
అనిల్ దివాన్, గోపాల్ సుబ్రమణ్యం కలిసి బీసీసీఐ కొత్త సభ్యులను ఎంపిక చేస్తారు. అయితే ఆ ఇద్దరు న్యాయవాదులు కలిసి బీసీసీఐ పాలనా వ్యవహారాలకు సంబంధించిన పేర్లను రెండు వారాల్లోగా తమకు అందజేయాలని సుప్రీం పేర్కొంది. కాగా, కొత్త సభ్యులకు సంబంధించిన సమాచారాన్ని జనవరి 19న ప్రకటిస్తామని సుప్రీం తన తీర్పులో పేర్కొంది.