డిఫెండింగ్ ఛాంపియన్, ఐపీఎల్ లో అత్యంత కీలక ఫ్రాంచైజీలలో ఒకటైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎట్టకేలకు చేతులు మారింది. కొత్త యాజమాన్యం చేతికి వచ్చింది. ఆదిత్స్య బిర్లా గ్రూప్ సారథ్యాన్ని వహిస్తోన్న కన్సార్టియం దీన్ని కొనుగోలు చేసింది. బిర్లాతో పాటు ఈ కన్సార్టియంలో టైమ్స్ ఆఫ్ ఇండియా, బోల్ట్ వెంచర్స్, బ్లాక్స్టోన్ సంస్థలు ఉన్నాయి. మొత్తం 1.78 బిలియన్ డాలర్లు పెట్టి ఈ జట్టును కొనుగోలు చేశాయి. భారత కరెన్సీతో పోల్చితే దీని విలువ సుమారు 16,706 కోట్ల రూపాయలు.
అంతకుముందే అమెరికన్ వ్యాపారవేత్త కాల్ సోమానీ రాజస్థాన్ రాయల్స్ను దాదాపు 13,600 కోట్లకు దక్కించుకున్నారు. దీంతో ఒకే రోజు ఐపీఎల్లోని రెండు ప్రధాన జట్ల యాజమాన్యం మారడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ రెండు డీల్స్ భారత క్రికెట్పై విస్తృతంగా ప్రభావం చూపనున్నాయి. ఈ ఒప్పందం వైన్, స్పిరిట్స్ దిగ్గజమైన డియాజియో అనుబంధ సంస్థ అయిన యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్తో ముగిసింది.

ఇందులో ఆర్సీబీ 100 శాతం వాటాలు బదిలీ అవుతాయి. ఐపీఎల్ పురుషులు, మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) జట్టుకు సంబంధించిన పూర్తి యాజమాన్య హక్కులు ఇప్పుడు కొత్త కన్సార్టియాని బదిలీ అయ్యాయి. దీనికి ఆదిత్స్య బిర్లా గ్రూప్ కు చెందిన ఆర్యమాన్ విక్రమ్ బిర్లా ఛైర్మన్గా వ్యవహరించనున్నారు. టైమ్స్ గ్రూప్ నుండి సత్యన్ గజ్వాని వైస్ ఛైర్మన్గా బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ కన్సార్టియంలో బోల్ట్ వెంచర్స్ ప్రతినిధిగా డేవిడ్ బ్లిట్జర్, బ్లాక్స్టోన్ తరఫున వైరల్ పటేల్ కూడా కీలక సభ్యులుగా ఉంటారు.
ప్రస్తుతానికి, ఈ డీల్ కొన్ని నిర్దుష్ట షరతులకు లోబడి ఉంటుంది. బీసీసీఐ, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాతో పాటు ఇతర నియంత్రణ సంస్థల నుండి దీనికి సంబంధించిన తుది ఆమోదాలు ఇంకా పొందాల్సి ఉంది. ఈ అనుమతులు వచ్చాకే ఒప్పందం పూర్తిగా అమలులోకి వస్తుంది. దీనిపై ఆదిత్స్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార్ మంగళం బిర్లా స్పందించారు. ఐపీఎల్ గత 20 ఏళ్లలో క్రికెట్ స్వరూపాన్ని మార్చివేసిందని గుర్తుచేశారు.
ఆర్సీబీ వంటి ఓ ఐకానిక్ జట్టును కొనుగోలు చేయడం ఓ గొప్ప గౌరవంగా అభివర్ణించారు. టైమ్స్ గ్రూప్కు చెందిన సత్యన్ గజ్వాని ఈ సందర్భంగా మాట్లాడారు. ఐపీఎల్లో అత్యంత పాపులర్ బ్రాండ్లలో ఆర్సీబీ ఒకటిగా నిలిచిందని, దీన్ని గ్లోబల్ స్పోర్ట్స్ బ్రాండ్గా తీర్చిదిద్దడమే తమ ఉద్దేశమని వ్యాఖ్యానించారు.