
క్వారంటైన్కు.. ఆ లగ్జరీ హోటల్:
ఈ ఏడాది చివరలో టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. కరోనా కారణంగా ఆ పర్యటన కూడా సందిగ్ధంలో పడింది. ఒకవేళ టెస్ట్ సిరీస్ కోసం ఆస్ట్రేలియాలో కనుక పర్యటిస్తే.. టీమిండియా 14 రోజులు క్వారంటైన్లో ఉండాల్సివుంటుంది. దీనికోసం విరాట్ సేన అడిలైడ్ ఓవల్లో కొత్తగా రూ. 322 కోట్లతో నిర్మించిన హోటల్ను క్వారంటైన్ సెంటర్గా ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఈ మేరకు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ)కు సౌత్ ఆస్ట్రేలియా క్రికెట్ అసోసియేషన్ (సాకా) చీఫ్ కీత్ బ్రాడ్షా ఓ ప్రతిపాదన పంపారని 'ది ఏజ్' పేర్కొంది.

క్రికెట్ ఆస్ట్రేలియా కసరత్తు:
మహమ్మారి కరోనాను నియంత్రించడానికి సరిహద్దులు మూసివేసిన ఆస్ట్రేలియా ప్రభుత్వం.. ప్రయాణాలపైనా కఠిన ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలో అనుకున్న ప్రకారం సిరీస్లు జరిగితే పర్యటక జట్ల ఆరోగ్యం, భద్రత కోసం ఎలాంటి ఏర్పాట్లు చేయాలనే అంశంపై క్రికెట్ ఆస్ట్రేలియా తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం ఆస్ట్రేలియా వచ్చే వాళ్లందరికీ 14 రోజుల ఐసోలేషన్ తప్పనిసరి. దీని వల్ల భారత జట్టు సాధనకు ఇబ్బంది ఎదురయ్యే అవకాశముంది. అయితే సెప్టెంబరులో ఆరంభమయ్యే 138 గదుల ఓవల్ హోటల్లో ఉంటే.. కోహ్లీసేనకు చాలా సౌకర్యంగా ఉంటుంది. హోటల్కు ఆనుకుని ఉన్న నెట్స్లో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అలాగే అక్కడ మంచి భోజన సదుపాయం కూడా ఉందట.

షెడ్యూల్ ప్రకారమే టీ20 ప్రపంచకప్:
మరోవైపు అనుకున్న ప్రకారమే మెగా టోర్నీని నిర్వహిస్తామని టీ20 ప్రపంచకప్ నిర్వాహక కమిటీ సీఈఓ నిక్ హాక్లీ ఇటీవలే స్పష్టం చేస్తున్నాడు. ఆస్ట్రేలియాలో వాయిదా పడ్డ ఆస్ట్రేలియన్ ఫుట్బాల్ లీగ్, జాతీయ రగ్బీ లీగ్లతో ప్రపంచకప్కు పోటీ ఎదురయ్యే అవకాశముంది. అయినా సరే.. ముందుగా అనుకున్న ప్రకారమే ప్రపంచకప్ను నిర్వహిస్తామన్నారు. 2020 అక్టోబర్ 18 నుండి 2020 నవంబర్ 15 వరకు ఆస్ట్రేలియాలోని ఏడు వేదికలలో ప్రపంచకప్ టోర్నీ జరగనుంది.


Click it and Unblock the Notifications












