అయిదు టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అడిలైడ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా చేతిలో భారత్ 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. అన్ని విభాగాల్లో విఫలమై సిరీస్లో ఆధిక్యాన్ని 1-1తో సమం చేసుకుంది. తొలి టెస్టులో గెలిచిన జోరును డే/నైట్ టెస్టులో టీమిండియా కొనసాగించలేకపోయింది.
ఈ నేపథ్యంలో టీమిండియా ప్రదర్శనపై విమర్శలు వస్తున్నాయి. అయితే బీసీసీఐని క్రికెట్ ఆస్ట్రేలియా (ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు) మోసం చేయడమే అడిలైడ్ టెస్టులో భారత్ ఓటమికి కారణమని నెట్టింట్లో కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. ప్రణాళికతో షెడ్యూల్ చేసి టీమిండియాను ఆసీస్ బోర్డు దెబ్బ కొట్టిందని, ప్రపంచంలో అత్యంత ధనవంతమైన బోర్డు అయిన బీసీసీఐ కూడా దీన్ని వ్యతిరేకించలేకపోయిందని వాదనలు వినిపిస్తున్నాయి.

ఆరోపణలు ఏంటంటే.. అడిలైడ్ వేదికపై డే/నైట్ టెస్టు కాకుండా రెగ్యులర్ మ్యాచ్ నిర్వహిస్తే భారత్ పైచేయి సాధిస్తుందని ముందే ఊహించి ఆస్ట్రేలియా బోర్డు సిరీస్ షెడ్యూల్ సిద్ధం చేసింది. ఆస్ట్రేలియాలోని ఇతర మైదానలతో పోలిస్తే అడిలైడ్ మైదానం భారత క్రికెటర్ల ఆటకు నప్పేలా ఉంటుంది. ఈ వేదికగా డే టైమ్లో జరిగిన గత అయిదు మ్యాచ్ల్లో టీమిండియా రెండింట్లోనే ఓటమిపాలైంది. అందులో ఒక్క పోరులో 48 పరుగుల స్వల్ప తేడాతోనే ఓడింది.
2003లో విజయం సాధించింది. 2008లో జరిగిన మ్యాచ్ను డ్రా ముగించింది. 2018లోనూ భారత్ నెగ్గింది. అయితే 2020లో అడిలైడ్ వేదికగా జరిగిన డే/నైట్ టెస్టులో భారత్ 36 పరుగులకే కుప్పకూలి అపకీర్తి మూటగట్టుకుంది. మరోవైపు వెస్టిండీస్తో గబ్బా వేదికగా ఇటీవల జరిగిన డే/నైట్ టెస్టులో ఆస్ట్రేలియా ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా షెడ్యూల్ చేయడంలో వ్యూహాత్మకంగా వ్యవహరించింది. తమ జట్టుకు కలిసొచ్చేలా అడిలైడ్ వేదికగా డే/నైట్ మ్యాచ్ను, గబ్బా వేదికగా రెగ్యులర్ టెస్టు మ్యాచ్ను షెడ్యూల్ చేసింది.
కాగా, అన్ని విభాగాల్లో విఫలమై అడిలైడ్ టెస్టులో రోహిత్ సేన ఓటమిపాలైనప్పటికీ, ఈ కారణాలు కూడా మ్యాచ్ను ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయని క్రికెట్ నిపుణులు సైతం పేర్కొంటున్నారు. మరోవైపు సొంతగడ్డపై ఆడే జట్లు ఈ వ్యూహాలను అమలు చేయడంలో తప్పులేదని కొందరు మద్దతు ఇస్తున్నారు. గబ్బా వేదికగా శనివారం నుంచి మూడో టెస్టు జరగనుంది. భారత కాలమాన ప్రకారం ఉదయం 5.50 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.