డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడే భారత జట్టులో మిడిలార్డర్ చాలా బలహీనంగా ఉంది. రిషభ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ ఇప్పటికే గాయాలతో జట్టుకు దూరమయ్యారు. తాజాగా కేఎల్ రాహుల్ కూడా ఈ మ్యాచ్ ఆడటం లేదని ప్రకటించాడు. అతను కూడా తొడకు శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చిందని వెల్లడించాడు. ఈ క్రమంలో సీనియర్ వికెట్ కీపర్ బ్యాటర్ వృద్ధిమాన్ సాహాను మళ్లీ జట్టులోకి తీసుకోవాలని నిపుణులు చెప్తున్నారు.
మిడిలార్డర్ సమస్యతో ఇబ్బంది పడుతున్న టీమిండియాలో సాహా చేరితే.. మంచి అనుభవం ఉన్న బ్యాటర్ కూడా దొరికినట్లే. అంతేకాదు, దేశంలో టాప్ వికెట్ కీపర్లలో సాహా ఒకడు. దానికితోడు విదేశాల్లో ప్లేయర్లు రాణించాలంటే.. అక్కడ ఆడిన అనుభవం చాలా ముఖ్యం. అది లేకుండా కొత్త వాళ్లు వెళ్లినా ఆ పరిస్థితుల్లో రాణిస్తారనే నమ్మకం ఉండదు. కానీ సాహా వంటి సీనియర్లకు ఈ సమస్య ఉండదు. ఎందుకంటే అతను దాదాపుగా ప్రతి దేశంలోనూ ఆడిన వాడే.

రిషభ్ పంత్ లేకపోవడంతో టీమిండియా మిడిలార్డర్లో కౌంటర్ ఎటాకింగ్ బ్యాటింగ్ చేసే ఆటగాడు లేకుండా పోయాడు. ఈ స్థానంలో సూర్యకుమార్ను తీసుకున్నా.. అతను టెస్టుల్లో రాణించడం కష్టంగా కనిపిస్తోంది. అదే సమయంలో సాహా అయితే అవసరమైతే విధ్వంసకర బ్యాటింగ్ చేయగలడు. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఓపెనింగ్ చేస్తున్న అతను.. తనలో ఎంత విధ్వంసకర బ్యాటర్ ఉన్నాడో చూపిస్తూనే ఉన్నాడు. కాబట్టి పంత్ లేని లోటును కూడా అతను తీర్చగలడు.
టెస్టుల్లో సెకండ్ ఆప్షన్ వికెట్ కీపర్గా ఉన్న ఆటగాళ్లకు మంచి రికార్డు ఉండటం అంత ఈజీ కాదు. కానీ సాహా తన కెరీర్లో చక్కగా రాణించాడు. ముఖ్యంగా కీపర్గా సాహా టెక్నిక్
దేశంలో టాప్ అని చెప్పొచ్చు. దానికితోడు బ్యాటింగ్లోనూ అతను జట్టును ఆదుకోగలడు. అతని కెరీర్ యావరేజ్ 29 కూడా తక్కువేం కాదు. ఈ క్రమంలోనే రాహుల్ లేకపోవడంతో అనుభవం లేని ఇషాన్ కిషన్కు ఈ కీలక మ్యాచ్లో అవకాశం ఇవ్వడం సరైన నిర్ణయంలా కనిపించడం లేదు. ఈ కారణంగానే అతన్ని ఇంగ్లండ్ పంపాలని బీసీసఐ పెద్దలు భావిస్తున్నారని తెలుస్తోంది.