
అదాని గ్రూప్ ఆరోపణలేంటీ?
కొత్త ఐపీఎల్ ఫ్రాంఛైజీని సాధించలేక చతికిల పడిన దేశీయ పారిశ్రామిక దిగ్గజ కంపెనీ అదాని గ్రూప్- దాన్ని దక్కించుకున్న సీవీసీ కేపిటల్ను లక్ష్యంగా చేసుకుంది. ఐపీఎల్ ఫ్రాంఛైజీని దక్కించుకోవడానికి సీవీసీ కేపిటల్ ధారపోసిన వేల కోట్ల రూపాయల ఆదాయం ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై ఆరా తీస్తోంది. ఆ సంస్థ యాజమాన్యానికి అక్రమ లావాదేవీలు ఉన్నాయని అదాని గ్రూప్ ఆరోపిస్తోంది. అక్రమంగా సాధించిన సొమ్మును ఇలా ఐపీఎల్ ఫ్రాంఛైజీని సాధించడానికి ఖర్చు చేసిందని విమర్శిస్తోంది.

లక్నో, అహ్మదాబాద్ ఫ్రాంఛైజీలు..
ఐపీఎల్ టోర్నమెంట్లోకి కొత్తగా రెండు జట్లు వచ్చిన విషయం తెలిసిందే. లక్నో, అహ్మదాబాద్ నుంచి రెండు ఫ్రాంచైజీలు ఐపీఎల్లో చేరనున్నాయి. దీనికి సంబంధించిన బిడ్డింగులను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ సోమవారం ప్రకటించింది. అహ్మదాబాద్ జట్టును సీవీసీ క్యాపిటల్, లక్నో ఫ్రాంఛైజీని సంజీవ్ గోయెంకాకు చెందిన ఆర్పీఎస్జీ గ్రూప్ కొనుగోలు చేశాయి. ఆర్పీఎస్జీ గ్రూప్ అత్యధికంగా 7,090 కోట్ల రూపాయలను చెల్లించింది. బీసీసీఐ నిర్ధారించిన బేస్ ప్రైజ్కు ఇది 250 శాతం అదనం.

అదాని కంటే అధికంగా బిడ్డింగ్..
అహ్మదాబాద్కు చెందిన సీవీసీ కేపిటల్.. సైతం భారీ మొత్తంలో ఖర్చు చేసింది. బీసీసీఐ నిర్దేశించిన బేస్ ప్రైజ్ కంటే 160 శాతం అధికంగా బిడ్డింగులను దాఖలు చేసింది. దీని విలువ 5,625 కోట్ల రూపాయలు. ఇది కాస్తా పోటీ కంపెనీ అదాని గ్రూప్కు మింగుడు పడట్లేదు. తాను దాఖలు చేసిన బిడ్డింగ్ కంటే అధికంగా బేస్ ప్రైజ్ను చెల్లించి మరీ ఫ్రాంఛైజీని దక్కించుకోవడాన్ని జీర్ణించుకోలేకపోతోంది. దేశీయ పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానికి చెందిన ఈ గ్రూప్.. సీవీసీ కేపిటల్ అక్రమాలపై నిఘా పెట్టింది.

బేస్ ప్రైజ్ రూ.2,000 కోట్లు ఉంటే..
ఫ్రాంఛైజీని తీసుకోవడానికి బీసీసీఐ నిర్ధారించిన బేస్ ప్రైజ్ 2,000 కోట్ల రూపాయలు. సీవీసీ గ్రూప్ అత్యధికంగా 5,625 కోట్ల రూపాయల మేర ఫైనాన్సియల్ బిడ్డింగ్ను దాఖలు చేసింది. అదాని వేసిన బిడ్డింగ్ ప్రైజ్ విలువ 5,100 కోట్ల రూపాయలు. అదాని కంటే అధికంగా బిడ్ను కోట్ చేసినందున.. సీవీసీ కేపిటల్కు ఫ్రాంఛైజీ దక్కింది. తనకంటే అధికంగా 525 కోట్ల రూపాయలను చెల్లించడాన్ని అదాని గ్రూప్కు తగిలిన బిగ్ షాక్గా చెప్పుకొంటున్నారు విశ్లేషకులు.

సీవీసీ కేపిటల్పై రివెంజ్..
దీనితో- సీవీసీ కేపిటల్పై రివెంజ్ తీర్చుకోవడానికి అదాని గ్రూప్ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. బెట్టింగుల్లో ఆరితేరిన కంపెనీగా అభివర్ణిస్తోంది. బెట్టింగులు, దాని అనుబంధ కార్యకలాపాలు, ఆర్థిక లావాదేవీలు సీవీసీ కేపిటల్కు ఉన్నాయని ఫిర్యాదు చేయడానికి సన్నద్ధమౌతున్నట్లు చెబుతున్నారు. దేశంలో బెట్టింగులు నిషేధం. అయినప్పటికీ- అక్రమంగా వాటిని నిర్వహించి వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించిందని, దాన్నంతటినీ ఐపీఎల్ ఫ్రాంఛైజీ కోసం ధారపోసిందని అదాని ఆరోపిస్తున్నట్లు చెబుతున్నారు. దీనిపై బీసీసీఐకి లిఖితపూరకంగా ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications












