హైదరాబాద్: లండన్ వేదికగా జరుగుతున్న నాట్వెస్ట్ టీ20 బ్లాస్ట్ టోర్నీలో ఇంగ్లండ్ టెస్టు క్రికెటర్ ఆడమ్ లైత్ అరుదైన ఘనత సాధించాడు. ఈ టోర్నీలో భాగంగా యార్కషైర్ తరపున బరిలోకి దిగిన ఆడమ్ లైత్ 161 పరుగులు సాధించాడు. తద్వారా టీ20ల్లో అత్యధిక స్కోరు నమోదు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్ధానంలో నిలిచాడు.
73 బంతుల్లో 20 ఫోర్లు, 7 సిక్సర్లతో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్రమంలో న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ బ్రెండన్ మెక్కల్లమ్ నమోదు చేసిన 158 పరుగుల రికార్డుని సైతం అధిగమించాడు. గతంలో టీ20ల్లో మెక్కల్లమ్ రెండు సార్లు 158 పరుగుల మార్కును చేరుకున్నాడు. 2008 ఐపీఎల్లో కోల్ కతా నైట్ రైడర్స్ తరపున బరిలోకి దిగి అజేయంగా 158 పరుగులు చేయగా, తర్వాత ఇదే టోర్నీలో 2015లో వార్విక్ షైర్ తరపున ఆడి ఈ ఘనతను సాధించాడు.

ఇదిలా ఉంటే టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు మాత్రం విండిస్ విధ్వంసకర బ్యాట్స్మెన్ క్రిస్ గేల్ (175*) పేరిట ఉంది. ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహిస్తోన్న గేల్ టీ20ల్లో అత్యధిక పరుగులు నమోదు చేశాడు. ఆ తర్వాత జింబాబ్వే ఆటగాడు హామిల్టన్ మసకడ్జా(162) ఉన్నాడు.
ఇదిలా ఉంటే ఆడమ్ లైత్ విధ్వంసకర ఇన్నింగ్స్తో యార్క్ షైర్ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 260 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్కి దిగిన స్టీల్ బాక్స్ జట్టు 136 పరుగులకే ఆలౌటైంది. అయితే ప్రపంచ రికార్డుకు యార్క్ షైర్ నాలుగు పరుగుల దూరంలో నిలిచిపోయింది.
మరో నాలుగు పరుగులు చేసుంటే టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా నిలిచేది. గతేడాది సెప్టెంబర్లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా చేసిన 263 పరుగులే ఇప్పటివరకు అత్యధిక స్కోరు. అలాగే ఎసెక్స్ ఈగల్స్-కెంట్ స్పిట్ఫైర్స్ మధ్య జరిగిన మ్యాచ్లో కెంట్ జట్టుకి చెందిన ఓపెనర్లు డెన్లి-బెల్ జోడీ తొలి వికెట్కి 207 పరుగులు జోడించారు.