మెల్బోర్న్: శివసేన హెచ్చరికల నేపథ్యంలో ఈ ఏడాది జరిగే ఐపియల్ 3కి ఆస్ట్రేలియా క్రికెటర్ ఆడమ్ గిల్ క్రిస్ట్ దూరమయ్యే అవకాశాలున్నాయి. ఆస్ట్రేలియాలో భారతీయులపై జరుగుతున్న దాడులకు నిరసనగా ముంబైలో ఆ దేశ క్రికెటర్లను ఆడనివ్వబోమని శివసేన చీఫ్ బాల్ థాకరే హెచ్చరించారు. భారత్ వెళ్లడం క్షేమం కాదని భద్రతా బలగాలు చెప్తే హైదరాబాదు దక్కన్ చార్జర్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న గిల్ క్రిస్ట్ ఐపియల్ లో ఆడకపోవచ్చు. పరిస్థితి గిల్ క్రిస్ట్ కు బాగా తెలుసునని, భారత్ లో భద్రత గురించి అతనికి భయాలు లేవని, అయితే శివసేన వంటి సంస్థల హెచ్చరికల నేపథ్యంలో ఆందోళన చెందవచ్చునని ది డైలీ టెలిగ్రాఫ్ రాసింది. క్రికెట్ ఆస్ట్రేలియా, భద్రతా నిపుణుల సలహా మేరకు గిల్ క్రిస్ట్ నిర్ణయం తీసుకోవచ్చునని, ఆస్ట్రేలియన్ క్రికెటర్స్ సంఘం సూచనలు కూడా తీసుకుంటాడని ఆయన మేనేజర్ స్టీఫెన్ అట్కిన్సన్ చెప్పారు.