భారత్తో జరగనున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఆస్ట్రేలియా గెలుస్తుందని ఆ దేశ మాజీ క్రికెటర్ ఆడమ్ గిల్క్రిస్ట్ జోస్యం చెప్పాడు. అయితే టీమిండియాతో ప్యాట్ కమిన్స్ సేన జాగ్రత్తగా ఉండాలని సూచించాడు. విదేశీ గడ్డలపై సిరీస్లను ఎలా గెలవాలో భారత జట్టుకు బాగా తెలుసని అన్నాడు. మరి కొన్ని వారాల్లో టెస్టు ఫార్మాట్ సందడి మొదలుకానున్న విషయం తెలిసిందే.
స్వదేశంలో సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాదేశ్తో రెండు టెస్టులు, అక్టోబర్ 16 నుంచి న్యూజిలాండ్తో మూడు టెస్టులు భారత్ ఆడనుంది. అనంతరం ఈ ఏడాది ఆఖర్లో ఆస్ట్రేలియా గడ్డపై బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియా అయిదు టెస్టుల సుదీర్ఘ సిరీస్ ఆడనుంది. కంగారూల గడ్డపై గత రెండు బోర్డర్-గవాస్కర్ సిరీస్లను కైవసం చేసుకున్న భారత్ ఈ సారి కూడా ఫేవరేట్గానే బరిలోకి దిగుతోంది.

2016 నుంచి టీమిండియానే ఈ ట్రోఫీని వరుసగా గెలుస్తున్న విషయం తెలిసిందే. 2016/17, 2022/23లో భారత్, 2018/19, 2020/21లో ఆస్ట్రేలియా ఈ ట్రోఫీకి ఆతిథ్యం ఇచ్చింది. అయితే భారత జట్టులో అద్భుతమైన నైపుణ్యం ఉన్నప్పటికీ ఈ సారి ఆస్ట్రేలియా గెలుస్తుందని గిల్క్రిస్ట్ ధీమా వ్యక్తం చేశాడు.
''భారత్కు బలమైన ఫాస్ట్ బౌలింగ్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా సత్తాచాటగలరు. ఆస్ట్రేలియాలోని పరిస్థితులను ఆస్వాదించలగరు. అంతేగాక గొప్ప నాణ్యమైన బ్యాటర్లు వాళ్ల సొంతం. ఈ సిరీస్ అద్భుతంగా సాగుతుంది. ఆస్ట్రేలియా విజయం సాధిస్తుందని భావిస్తున్నాను. ఇరు జట్ల మధ్య పోరు హోరాహోరీగా సాగడం ఖాయం. విదేశాల్లో సిరీస్లు ఎలా గెలవాలో భారత్కు బాగా తెలుసు. సొంతగడ్డపై ఆధిపత్యం నిరూపించుకోవాల్సిన బాధ్యత ఆస్ట్రేలియాపై ఉంది'' అని గిల్క్రిస్ట్ పేర్కొన్నాడు.
నవంబర్ 22 నుంచి భారత్-ఆస్ట్రేలియా అయిదు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తొలి టెస్టు పెర్త్ వేదికగా నవంబర్ 22-26 వరకు జరగనుంది. అలాగే అడిలైడ్ వేదికగా పింక్ బాల్ టెస్టు డిసెంబర్ 6-10 వరకు, బ్రిస్బేన్ వేదికగా డిసెంబర్ 14-18 వరకు మూడో టెస్టు, డిసెంబర్ 26-30 వరకు బాక్సింగ్ డే టెస్టు, సిడ్నీ వేదికగా జనవరి 3 నుంచి 7 వరకు ఆఖరి టెస్టు జరగనుంది.