IPL 2025: భారత జట్టు మాజీ కెప్టెన్, దిగ్గజ వికెట్ కీపర్-బ్యాటర్ ఎంఎస్ ధోనికి ఐపీఎల్ 2025 అంత గొప్పగా ఏం లేదు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పరిస్థితి కూడా అలానే ఉంది. ఈ సీజన్లో ఇప్పటివరకు చెన్నై సూపర్ కింగ్స్ మొత్తం 9 మ్యాచ్లు ఆడగా.. 7 మ్యాచ్ల్లో ఓడిపోయింది. సీఎస్కే నాలుగు పాయింట్లతో పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. అయితే వారు ఇంకా ప్లేఆఫ్స్ స్థానం కోసం పోరాడుతోంది. కానీ ప్లేఆఫ్స్ అవకాశం దాదాపుగా ఇప్పటికే చేజారింది. సీఎస్కే ఇక్కడి నుంచి టాప్-4లో చోటు సంపాదించడం అనేది అద్భుతం కంటే తక్కువేం కాదు.
ఈ సీజన్లో ఎంఎస్ ధోని బ్యాట్తో అంతగా రాణించలేదు. ఎంఎస్ ధోని ఆడిన 9 మ్యాచ్ల్లో కేవలం 140 పరుగులు మాత్రమే చేశాడు. రుతురాజ్ గైక్వాడ్ గాయం తర్వాత ఎంఎస్ ధోని ఇప్పుడు చెన్నై జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్ క్రిస్ట్ ఎంఎస్ ధోని గురించి కీలక ప్రకటన చేశాడు. వచ్చే సీజన్లో మహీ ఐపీఎల్లో ఉండకూడదని ఆయన చెప్పాడు.

ఎంఎస్ ధోని గురించి ఆస్ట్రేలియా లెజెండ్ కీలక ప్రకటన
ఆస్ట్రేలియా దిగ్గజ వికెట్ కీపర్-బ్యాటర్ ఆడమ్ గిల్క్రిస్ట్ క్రిక్ బజ్లో ఇలా అన్నాడు. గిల్క్రిస్ట్ మాట్లాడుతూ.. " ఎంఎస్ ధోని గొప్ప ఆటగాడు. ఎంఎస్ ధోని ఇకపై ఆటలో ఇంకా ఏమీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఎంఎస్ ధోని సాధించగలగేదంతా సాధించాడు. ఎంఎస్ ధోని ఇంకా ఏం చేయాలనుకుంటున్నాడో ఆయనకే తెలుసు. కానీ నేను ఆయన భవిష్యత్ కోసం చెబుతున్నాను. ధోని బహుశా వచ్చే ఏడాది అక్కడ ఉండాల్సిన అవసరం లేకపోవచ్చు. నాకు ధోని అంటే చాలా ఇష్టం.. ధోని ఒక ఛాంఫియన్, గొప్ప ఆటగాడు." అని అన్నాడు.
ఎంఎస్ ధోని ఐపీఎల్ కెరీర్
2008 నుంచి ఐపీఎల్ ఆడుతున్న ఎంఎస్ ధోని ఈ టోర్నమెంట్లో ఇప్పటివరకు 273 మ్యాచ్లు ఆడాడు. ఎంఎస్ ధోని 137.67 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తూ 5383 పరుగులు చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో మహీ పేరు మీద 24 అర్థ సెంచరీలు కూడా ఉన్నాయి.