న్యూఢిల్లీ: భారత జట్టుకు కోచ్గా ఉండేందుకు ఆసక్తి లేదని ఆస్ట్రేలియా గ్రేట్, మాజీ కెప్టెన్ గిల్ క్రిస్ట్ అన్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 9వ ఎడిషన్లో భాగంగా గిల్కిస్ట్ భారత్కు వచ్చారు. ఐపీఎల్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు గిల్క్రిస్ట్ కోచ్గా ఉన్నారు.
ఈ సందర్భంగా గురువారం గిల్కిస్ట్ మీడియాతో మాట్లాడుతూ టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీపై ప్రశంసలు కురిపించాడు. గత కొంతకాలంగా విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడుతున్నాడని కితాబు ఇచ్చాడు. వన్డే, టీ20 ఫార్మాట్లల్లో కూడా విజయపథంలో నడిపించే సామర్థ్యం కోహ్లీకి ఉందని అన్నాడు.
కోహ్లీ టెస్టు కెప్టెన్ పగ్గాలు తీసుకున్న తర్వాత భారత జట్టు ఆటలో వేగం పెరిగిందని అన్నాడు. తాజాగా ముగిసిన టీ20 వరల్డ్ కప్లో అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శనతో 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్'గా నిలిచాడని తెలిపాడు. కోహ్లీలో నాయకత్వ లక్షణాలు అమోఘమని కితాబు ఇచ్చాడు.

ప్రస్తుతం వన్డే, టీ20లకు నాయకత్వం వహిస్తున్న ధోనీ పరిమిత ఓవర్ల కెప్టెన్సీ బాధ్యతలను కూడా కోహ్లికి ఇస్తే జట్టుకు ఎక్కువ ప్రయోజనం ఉంటుందని గిల్క్రిస్ట్ పరోక్షంగా సూచించాడు. అలాగే ధోనీ నాయకత్వ ప్రతిభను తక్కువ చేసినట్లు కాదనీ.. భారత్ క్రికెట్ చరిత్రలో ధోనీ చిరస్మరణీయ విజయాలు సాధించాడని చెప్పాడు.
'విరాట్ కోహ్లికి మూడు ఫార్మాట్లలో కెప్టెన్సీ అప్పగించేందుకు ఇదే తగిన సమయం అని మీరనుకుంటున్నారా'అన్న ప్రశ్నకు గిల్క్రిస్ట్ బదులిస్తూ.. 'అది నేనెలా నిర్ణయించగలను. 27 ఏళ్ల కోహ్లి ఇంకా పదేళ్ల పాటు క్రికెట్ ఆడే సామర్థ్యం ఉంది. ఆ సమయంలో ఆటతో పాటు మూడు ఫార్మాట్లలో కెప్టెన్సీ చేసే అవకాశం ఉంటుంది' అని గిల్క్రిస్ట్ చెప్పాడు.
ఇటీవల కాలంలో మైదానంలో భారత్, ఆస్ట్రేలియా ఆటగాళ్ల మధ్య చిన్నపాటి గొడవలపై గిల్క్రిస్ట్ స్పందిస్తూ మ్యాచ్ సమయంలో అలాంటివి సర్వసాధారణమనీ, అయితే ఐపీఎల్ పుణ్యమా అని ఇరు దేశాల ఆటగాళ్ల మధ్య మంచి స్నేహ బంధం ఏర్పడిందని చెప్పాడు.
చివరగా భారత జట్టుకు పుల్ టైమ్ కోచ్గా బాధ్యతలు స్వీకరిస్తారా? అన్న ప్రశ్నకు కోచ్గా ఆసక్తి లేదన్నాడు. ప్రస్తుతం తన దృష్టంతా ఐపీఎల్ పైనే ఉందని చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ తనకున్న అనుభవాన్ని గుర్తు చేసుకుని గర్వంగా ఫీలయ్యారు. రిటైర్మెంట్ అనంతరం గిల్క్రిస్ట్ ఆస్ట్రేలియా ఎడ్యుకేషన్ అంబాసిడర్గా ఉన్నారు.