
రెండు, మూడు రోజులుగా నెలకొన్న వివాదం నేపథ్యంలో ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నేహ్వాల్కు హిరో సిద్ధార్థ్ క్షమాపణలు చెప్పాడు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఒక బహిరంగ లేఖను విడుదల చేశాడు. 'డియర్ సైనా .. కొన్ని రోజుల క్రితం మీరు చేసిన ట్వీట్కు నేను స్పందిస్తూ చేసిన రిట్వీట్ను ఉద్దేశించి మీకు క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను' అని రాసుకొచ్చాడు. మనం జోక్ చేసినప్పుడు దానికి క్షమాపణలు చెప్పాల్సి వస్తే అది నిజంగా మంచి జోక్ కాదని ఆ ట్వీట్లో సిద్ధార్థ్ పేర్కొన్నాడు. ఆ జోక్కు తాను క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపాడు.
చాలా విషయాల్లో నేను మిమ్మల్ని విభేదించోచ్చు అని అన్నాడు. కానీ సైనా ట్వీట్ చదివినప్పుడు నిరాశ, కోపంతో తాను చేసిన కామెంట్లు మాత్రం సరైనవి కావని సిద్ధార్థ్ అంగీకరించాడు. అయితే చాలా మంది అంటున్నట్లుగా నా పదజాలం, జోక్ వెనుక సైనాను అగౌరవంతో అవమానపరిచే ఉద్దేశం తనకు లేదని వివరణ ఇచ్చాడు. తన ఉద్దేశంలో ఎలాంటి తప్పు లేకున్నా కొందరు దానిని తప్పుగా చూపి తన మీద విమర్శలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. మహిళలంటే తనకు గౌరవమని చెప్పిన సిద్ధార్థ్, తన క్షమాపణలను సైనా అంగీకరిస్తుందని ఆశిస్తున్నట్లు ఆ బహిరంగ లేఖలో పేర్కొన్నాడు. అంతేకాకుండా మీరు ఎప్పటికీ మా ఛాంపియన్గానే ఉంటారని సిద్ధార్థ్ చెప్పాడు.
అసలు ఏం జరిగిందంటే ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటనలో చోటు చేసుకున్న భద్రతా వైఫల్యం గురించి ప్రస్తావిస్తూ దేశ ప్రధానికే భద్రత లేకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని, ప్రధాని మోదీపై జరిగిన అరాచక చర్యను తాను ఖండిస్తున్నానని సైనా నేహ్వాల్ ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చింది. ఈ ట్వీట్ను సైనా జనవరి 5న రాయగా, దీనిపై జనవరి 6న నటుడు సిద్ధార్థ్ స్పందిస్తూ రిట్వీట్ చేశాడు. ఓ చిన్న కాక్ తో ఆడే ప్రపంచ ఛాంపియన్ అని, దేవుడా ధన్యావాదాలు, దేశాన్ని కాపాడడానికి కొందరు రక్షకులు ఉన్నారని వ్యంగ్యంగా అసభ్యకర అర్థం వచ్చేలా రిట్వీట్ చేశాడు.
దీంతో సిద్ధార్థ్ వ్యాఖ్యలపై అంతటా విమర్శలు చెలరేగాయి. సైనాతోపాటు ఆమె భర్త, పారుపల్లి కశ్యప్, సైనా తండ్రి.. సిద్ధార్థ్ వ్యాఖ్యలను ఖండించారు. జాతీయ మహిళా కమిషన్తోపాటు ప్రముఖులు, అభిమానులు మహారాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేసి ఎఫైఐఆర్ నమోదు చేయాలని కోరారు. అలాగే సిద్ధార్థ్ ట్విట్టర్ ఖాతాను బ్లాక్ చేయాలని లేఖలు కూడా రాశారు. కానీ తాజాగా సిద్ధార్థ్ క్షమాపణలు చెప్పడంతో ఈ వివాదం ముగిసిపోయిందని అనుకోవచ్చు.