టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. పదవిలో ఉన్నంత మాత్రాన గౌరవం దక్కదని, మన ప్రవర్తనతో దాన్ని సంపాదించుకోవాలని ధోనీ పేర్కొన్నాడు. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ధోనీ మాట్లాడాడు.
''గౌరవం, విధేయతకు చాలా సంబంధం ఉంటుంది. మనపై ఇతర వ్యక్తుల్లో గౌరవం ద్వారానే విధేయత వస్తుంది. డ్రెస్సింగ్ రూమ్లో సహచర ఆటగాళ్లు, సహాయ సిబ్బంది మన పట్ల గౌరవం లేకపోతే విధేయతతో ఉండరు. మనం కేవలం మాటలు చెబితే సరిపోదు. దాన్ని చేతల్లోనే చూపించాలి. కొన్నిసార్లు మనం మాట్లాడకపోయినా మన ప్రవర్తనే మనకు గౌరవం తెచ్చిపెడుతుంది''

''గౌరవం సంపాదించడం ముఖ్యమని ఎప్పుడూ భావించను. ఇక మన కుర్చీ (పదవీ) లేదా ర్యాంకు వల్ల గౌరవం వస్తుందని అసలు భావించను. మనం ఎలా ప్రవర్తిస్తామన్నదాన్ని బట్టే అది దక్కుతుంది. ఓవరాల్గా చెప్పాలంటే.. గౌరవం దానంతట అది రాదు. మనం సంపాదించుకోవాలి''అని ధోనీ పేర్కొన్నాడు.
అయితే విధేయత, గౌరవానికి సంబంధించిన ఈ వ్యాఖ్యలను ధోనీ యువత, విమర్శకులను ఉద్దేశించి చేశాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. యువతకు ప్రేరణ కలిగించేలా చేశాడని కొందరు, తనపై విమర్శలు చేసే వాళ్లకి కౌంటర్ ఇచ్చాడని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
కాగా, మరికొన్ని వారాల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ కోసం ధోనీ తిరిగి ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. నెట్స్లో కఠోర సాధన చేస్తున్నాడు. బ్యాటింగ్పై ఎక్కువ ఫోకస్ చేశాడు. ఐపీఎల్లో 42 ఏళ్ల ధోనీ చెన్నై సూపర్ కింగ్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. అయిదు సార్లు చెన్నైకి ధోనీ టైటిళ్లు అందించాడు. గత సీజన్లోనూ ఫైనల్లో గుజరాత్ టైటాన్స్పై నెగ్గి సీఎస్కే ట్రోఫీని సొంతం చేసుకుంది.
అయితే గత సీజన్ అనంతరం ధోనీ మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఇటీవల తిరిగి పూర్తిఫిటెనెస్ సాధించాడు. మరోవైపు గత మూడేళ్లుగా ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ ధోనీ బరిలోకి దిగుతూ ట్రోఫీలను సాధిస్తున్నాడు.