
యూఏఈ: అండర్19 ఆసియా కప్లో నేడు సెమీఫైనల్ మ్యాచ్లు జరగనున్నాయి. సెమీఫైనల్లో యువ భారత్.. బంగ్లాదేశ్ అండర్ 19 జట్టును ఢీకొట్టనుంది. షార్జా వేదికగా ఉదయం 11 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. అదే సమయానికి దుబాయ్ వేదికగా జరగనున్న మరో సెమీఫైనల్లో పాకిస్థాన్ అండర్ 19 జట్టు, శ్రీలంక అండర్ 19 జట్టు తలపడనున్నాయి. ఈ నెల 23న యూఏఈ వేదికగా ప్రారంభం అయిన ఈ అండర్ 19 ఆసియా కప్ ఈ నెల 31న జరిగే ఫైనల్ మ్యాచ్తో ముగియనుంది. లీగ్ స్టేజ్లో భారత జట్టు యూఏఈని, ఆఫ్ఘనిస్థాన్ను ఓడించి సెమీఫైనల్ చేరింది. అయితే చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో మాత్రం ఇన్నింగ్స్ చివరి బంతికి ఓటమి పాలైంది.
లీగ్ స్టేజ్లో ఈ నెల 23న యూఏఈతో జరిగిన మ్యాచ్లో టీమిండియా 154 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఆ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్.. 5 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. ఓపెనర్ హర్నూర్ సింగ్( 130 బంతుల్లో 120 పరుగులు.. 11 ఫోర్లు) సెంచరీతో చెలరేగగా.. కెప్టెన్ యష్ ధుల్(68 బంతుల్లో 63 పరుగులు.. 4 ఫోర్లు) హాఫ్ సెంచరీతో రాణించాడు. షేక్ రషీద్ 35 పరుగులతో పర్వాలేదనిపించగా.. చివర్లో రాజవర్ధన్ హంగర్గేకర్ చెలరేగాడు. 6 ఫోర్లు, 2 సిక్స్లతో 23 బంతుల్లోనే 48 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అనంతరం భారత బౌలర్లు.. యూఏఈని 34.3 ఓవర్లలో 128 పరుగులకే ఆలౌట్ చేశారు. భారత బౌలర్లలో రాజవర్ధన్ హంగర్గేకర్ 3, గర్వ్ సాంగ్వాన్, విక్కీ ఓస్ట్వాల్,
కౌశల్ తాంబే తలో రెండు వికెట్లు తీశారు.
ఈ నెల 25న పాకిస్థాన్తో జరిగిన మరో మ్యాచ్లో ఓడినప్పకీ, 27న ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మరో మ్యాచ్లో 4 వికెట్ల తేడాతో గెలిచి యువ భారత్ సెమీఫైనల్లో అడుగుపెట్టింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ అండర్ 19 జట్టు 4 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది. ఇజాజ్ అహ్మద్ అహ్మద్జాయ్ 86 పరుగులతో, కెప్టెన్ సులిమాన్ సఫీ 73 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో రాజవర్ధన్ హంగర్గేకర్, రాజ్ బావ, విక్కీ ఓస్ట్వాల్, కౌశల్ తాంబే తలో వికెట్ తీశారు. అనంతరం లక్ష్యాన్ని భారత జట్టు మరో 10 బంతులు మిగిలి ఉండగానే చేధించింది. ఓపెనర్ హర్నూర్ సింగ్( 74 బంతుల్లో 65 పరుగులు.. 9 ఫోర్లు) హాఫ్ సెంచరీతో రాణించాడు. రాజ్ బావ 43, కౌశల్ తాంబే 35 పరుగులతో పర్వాలేదనిపించారు.