ఆసియా కప్ 2025లో భారత్ ఫైనల్ గెలిచి 72 గంటలకు పైగా అయ్యింది. అయినా విజేత జట్టుకు ట్రోఫీని అందజేయకపోవడంతో ఇప్పుడు ఈ వివాదం సంచలనం సృష్టిస్తోంది. ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) చీఫ్ మొహ్సిన్ నఖ్వీపై సంచలన ఆరోపణలు వస్తున్నాయి. ఆయన విజేత జట్టుకు ట్రోఫీని అప్పగించకుండా..తన హోటల్ గదికి ట్రోఫీని తీసుకెళ్లారని తెలుస్తుంది.
ట్రోఫీ వివాదం.. బీసీసీఐ అల్టిమేటం
మొహ్సిన్ నఖ్వీ ట్రోఫీని భారత జట్టుకు లేదా కనీసం ఏసీసీ కార్యాలయానికి కూడా పంపించలేదు. మంగళవారం జరిగిన ఏసీసీ సమావేశంలో ఈ విషయంపై చాలా దేశాల ప్రతినిధులు తీవ్ర నిరసన వ్యక్తం చేసినా.. మొహ్సిన్ నఖ్వీ తన పట్టుదలతో ట్రోఫీని హోటల్ గదిలోనే ఉంచారు. ఈ అంతర్జాతీయ క్రీడా స్ఫూర్తికి విరుద్ధమైన చర్యతో బీసీసీఐ (BCCI) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మొహ్సిన్ నఖ్వీపై ట్రోఫీ దొంగతనం, బలవంతంగా స్వాధీనం చేసుకున్నందుకు గానూ దుబాయ్ పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడానికి సన్నద్ధమవుతోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, బీసీసీఐ మొహ్సిన్ నఖ్వికి 72 గంటల అల్టిమేటం ఇచ్చింది. ఈ సమయంలోగా ఆయన ట్రోఫీని ACC ఆఫీస్కు పంపించకపోతే, దుబాయ్ పోలీసులకు అధికారికంగా కేసు నమోదు చేస్తారు.

మొహ్సిన్ నఖ్వీకి జైలు ప్రమాదం:
ట్రోఫీ విషయంలో మొహ్సిన్ నఖ్వీపై కేసు నమోదైతే దుబాయ్ కఠిన చట్టాల కారణంగా ఆయన జైలుకెళ్లేప్రమాదం ఉంది. దుబాయ్లో నేరాల రేటు చాలా తక్కువ. అక్కడ దొంగతనం లేదా బలవంతంగా ఆస్తిని స్వాధీనం చేసుకున్న కేసుల్లో శిక్ష తీవ్రతను బట్టి మారుతుంది. సాధారణంగా 6 నెలల నుంచి మూడేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించవచ్చు. కొన్ని తీవ్రమైన కేసులలో 3 నుంచి 15 ఏళ్ల వరకు జైలు శిక్ష కూడా పడవచ్చు. ఏసీసీ చీఫ్ హోదాలో ఉండి, విజేత జట్టు ట్రోఫీని అప్పగించకపోవడం 'దొంగతనం' లేదా బలవంతపు ఆక్రమణ పరిధిలోకి వస్తే, మొహ్సిన్ నఖ్వీ దీర్ఘకాలం జైలులో గడపాల్సి వచ్చే అవకాశం ఉంది.
మొహ్సిన్ నఖ్వీ ట్రోఫీతో దుబాయ్ వదిలి పాకిస్తాన్కు పారిపోకుండా ఉండేందుకు కూడా బీసీసీఐ యూఏఈ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. ప్రస్తుతం ఆసియా కప్ ట్రోఫీ క్రీడా గౌరవానికి చిహ్నంగా కాకుండా, వ్యక్తిగత పంతాలు, రాజకీయ ఆధిపత్య పోరాటానికి వేదికగా మారింది. ఈ వివాదం క్రికెట్ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తోంది.