రెండవ స్థానం వారికి సరైంది కాదు:
'ప్రసుత్తం ఐసీసీ ర్యాంకింగ్స్లో రెండో స్థానంలో ఉన్న న్యూజిలాండ్ గత రెండేళ్లలో ఎన్ని సిరీస్లు గెలిచిందో నాకు సరైన అవగాహన లేదు. కానీ.. ఈ ఏడాది వారి ప్రదర్శన చూస్తే.. రెండవ స్థానం వారికి సరైందికాదని నా అభిప్రాయం. నాలుగో స్థానంలో ఉన్న ఇంగ్లండ్ ప్రదర్శన ఏడాదిగా మెరుగుపడింది. గత మూడు, నాలుగేళ్లుగా ఇంగ్లండ్ జట్టు టెస్టు క్రికెట్లో నిలదొక్కుకోవడానికి చాలా ప్రయత్నించింది' అని మైకేల్ వాన్ అన్నాడు.
అవొక చెత్త ర్యాంకింగ్స్ :
'విదేశాల్లో మా (ఇంగ్లండ్) జట్టు పరిస్థితి దారుణంగా ఉండేది. ఈ ఏడాది ప్రదర్శన చేసుకుంటే.. స్వదేశంలో ఐర్లాండ్పై మాత్రమే సిరీస్ గెలుచుకుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే యాషెస్ సిరీస్ను డ్రా చేసుకుంది. ఈ నేపథ్యంలో ఐసీసీ ప్రకటించిన ర్యాంకులు కాస్త గందరగోళంగా ఉన్నాయి. ఐసీసీ ర్యాంకులను తప్పుబడుతున్నా. నా దృష్టిలో అవొక చెత్త ర్యాంకింగ్స్ అనుకుంటున్నా' వాన్ పేర్కొన్నాడు.
ఉత్తమ జట్లు భారత్, ఆస్ట్రేలియా:
'నా దృష్టిలో ప్రసుత్త టెస్టు క్రికెట్లో భారత్, ఆస్ట్రేలియాలు మాత్రమే ఉత్తమ జట్లు. 12 నెలల క్రితం ఆసీస్ను వారి సొంత గడ్డపై ఓడించిన ఘనత టీమిండియా సొంతం చేసుకుంది. అప్పటి సిరీస్లో డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, లబుషేన్ను జట్టులో లేకపోవడంతో ఆసీస్ టీమిండియాకు సిరీస్ అప్పగించిందని భావిస్తున్నా. వచ్చే ఏడాది చివరిలో భారత్ అడుగుపెట్టేసరికి ఆసీస్ జట్టు అన్ని అస్త్రాలతో సిద్ధంగా ఉంటుంది. బలమైన బౌలింగ్, బ్యాటింగ్ కలిగిన టీమిండియాను ఓడించడం ఒక్క ఆసీస్కు మాత్రమే సాధ్యం' అని వాన్ చెప్పుకొచ్చాడు.