SRH vs PBKS: ఐపీఎల్ చరిత్రలో సన్రైజర్స్ హైదరాబాద్ స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ పంజాబ్ కింగ్స్ జట్టుపై 141 పరుగుల తుఫాను ఇన్నింగ్స్ ఆడి జట్టుకు 8 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని కట్టబెట్టాడు. ఆతిథ్య హైదరాబాద్పై పంజాబ్ కింగ్స్ 245 పరుగుల భారీ స్కోరు చేసినప్పుడు గత కొన్ని మ్యాచ్ల్లో ఫామ్లో లేని సన్ రైజర్స్కు ఇది సాధించడం కష్టమే అనిపించింది. కానీ అభిషేక్ ఫోర్లు, సిక్సర్లతో వీరవిహారం చేయడంతో అందరూ సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు.
అభిషేక్ శర్మ తుఫాన్ ఇన్నింగ్స్ వల్లే హైదరాబాద్ జట్టు కేవలం 18.3 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 247 పరుగులు చేసింది. ఈ ఐపీఎల్ టోర్నమెంట్లో సన్రైజర్స్ ఆడిన ఆరో మ్యాచ్ లో రెండో విజయాన్ని సాధించింది. తద్వారా నాలుగు మ్యాచ్ ల ఓటములకు కూడా తెరపడింది. అభిషేక్ తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా పవర్ హౌస్ ట్రావిస్ హెడ్ కూడా 37 బంతుల్లో 66 పరుగులు చేసి లక్ష్యఛేదనను సులభతరం చేయడంలో దోహదపడ్డాడు.

ఐపీఎల్ 2025 పంజాబ్ కింగ్స్తో ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్లో 40 బంతుల్లో సెంచరీ విధ్వంసంతో చెలరేగాడు అభిషేక్ శర్మ . అనంతరం జేబులో నుంచి ఓ పేపర్ తీసి.. అందరికి చూపిస్తూ సంతోషం వ్యక్తం చేశాడు. ఆ పేపర్పై 'This one is for Orange army(ఈ సెంచరీ ఆరెంజ్ ఆర్మీ కోసం)'అని రాసి ఉంది. తాజాగా దీనిపై స్పందిస్తూ.. "నేను రోజు లేవగానే రాసుకోవడం అలవాటు. అలానే ఈ రోజు కూడా రాసుకున్నా. ఈ రోజు ఏమైనా చేస్తే.. అది ఆరెంజ్ ఆర్మీ కోసం అని రాసుకున్నా. అనుకోకుండా అదృష్టవశాత్తు అదే జరిగింది. ఈ రోజు నా రోజు." అని అభిషేక్ శర్మ చెప్పాడు. అయితే ఈ వేడుక గురించి ట్రావిస్ హెడ్ కీలక విషయాన్ని వెల్లడించాడు.
అభిషేక్ వేడుకపై కీలక విషయాన్ని బయటపెట్టిన ట్రావిస్ హెడ్
ఈ స్లిప్ అభిషేక్ శర్మ జేబులో 6 మ్యాచ్ ల పాటు ఉందని మ్యాచ్ తర్వాత ట్రావిస్ హెడ్ వెల్లడించాడు. అభిషేక్ శర్మ ప్రతి మ్యాచ్ కు ఈ స్లిప్ ను తన జేబులో పెట్టుకుని తీసుకెళ్లేవాడని చెప్పాడు. మ్యాచ్ అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ట్రావిస్ హెడ్ మాట్లాడుతూ.. 'ఈ నోట్ అభిషేక్ శర్మ జేబులో 6 మ్యాచ్ల నుంచి ఉంది, ఇది ఈ రాత్రి బయటకు వచ్చినందుకు నేను సంతోషంగా ఉన్నాను' అని అన్నాడు. 250 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసిన అభిషేక్ శర్మ తన ఇన్నింగ్స్లో 14 ఫోర్లు, 10 సిక్సర్లు కొట్టాడు.